తమిళ టాలెంటెండ్ డైరెక్టర్తో చరణ్ సినిమా, రెండు భాషల్లో విడుదల
లోకేశ్ కనగరాజు. టాలెంటెండ్ యువ తమిళ దర్శకుడు. అతడి దర్శకత్వంలో గతేడాది వచ్చిన ‘ఖైదీ’ చిత్రం తమిళ్లోనే కాదు తెలుగులోనూ బ్లాక్బాస్టర్ హిట్గా నిలిచింది. కార్తి ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించాడు. పోలీసులను కాపాడేందుకు ఓ ఖైదీ ఒక రాత్రంతా చేసిన పోరాటాన్ని లోకేశ్ అద్భుతంగా తెరకెక్కించాడు. అసాంతం ఉత్కంఠభరితంగా సాగే ఈ సినిమాను చూసిన చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ వెంటనే దర్శకుడు లోకేశ్ కనగరాజ్తో తెలుగులో ఓ సినిమా చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుందట.
కాగా, దర్శకుడు లోకేశ్ కనగరాజ్తో ఒప్పందం చేసుకునే సమయానికి హీరో ఎవరు? కథేంటీ అనే విషయాలను మాత్రం మైత్రీ మూవీ మేకర్స్ వెల్లడించలేదు. అయితే తాజాగా ఈ నిర్మాణ సంస్థ రామ్ చరణ్తో ఓ సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రామ్ చరణ్ నటించిన ‘రంగస్థలం’ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థే నిర్మించింది. ఇప్పుడు చరణ్తో మరో చిత్రం తీసేందుకు సిద్ధమవుతుందని సమాచారం. దీంతో రామ్ చరణ్ – లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్లోనే ఈ కొత్త సినిమా ఉంటుందని.. తమిళ్, తెలుగు ద్విభాష చిత్రంగా తెరకెక్కిస్తారని సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అదే నిజమైతే, లోకేశ్ దర్శకత్వం.. రామ్ చరణ్ నటనతో సినిమా అద్భుతంగా ఉంటుందని మెగా అభిమానులు భావిస్తున్నారు.
ప్రస్తుతం రామ్ చరణ్ రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలో నటిస్తుండగా.. లోకేశ్ కనగరాజ్ విజయ్తో ‘మాస్టర్’ చిత్రం తెరకెక్కించాడు. కాగా, లాక్డౌన్ కారణంగా షూటింగ్స్ తో పాటు విడుదల వాయిదా పడిన సంగతి తెలిసిందే.