ఏపీలో నాలుగు రోజులు వర్షాలు..బయటకు రాకండి
ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాయువ్య బంగాళాఖాతం, పరిసర ప్రాంతంలో 2020, ఆగస్టు 15వ తేదీ శనివారం అల్పపీడనం ఏర్పడనుందని, దీని ప్రభావంతో రాగల 4 రోజుల పాటు రాష్ట్రంలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వాహణ శాఖ కమీషనర్ కె.కన్నబాబు వెల్లడించారు. తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని తెలిపారు. ఈ నేపథ్యంలో మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దన్నారు.
ఆగష్టు 15, 16వ తేదీల్లో విశాఖ, తూర్పు జిల్లాలో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయన్నారు. రాష్ట్రంలో మిగిలిన చోట్ల అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించారు.
ఆగస్టు 14వ తేదీ శుక్రవారం విశాఖ, తూర్పు గోదావరి జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. రాష్ట్రంలో మిగిలిన చోట్ల అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లాలో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయన్నారు.