ప్రింట్ మీడియాపైనే నమ్మకం ఎక్కువ…ఎందుకంటే
ప్రింట్ మీడియా మాత్రమే పాఠకులపై ఎక్కువ ప్రభావం చూపుతుందని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. జర్నలిస్టులు సోషల్ మీడియాలో సమాచారం షేర్ చేసేటప్పడు చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రణబ్ అన్నారు. ఇవాళ(ఆగస్టు-25,2019)కోల్ కతాలో నిర్వహించిన మీడియా అవార్డుల కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ…తనకు ప్రింట్ మీడియా పట్ల అపారమైన నమ్మకం ఉందన్నారు. ఎందుకంటే ప్రింట్ మీడియాలో సమాచారం ఒకటికి రెండు సార్లు పరిశీలన చేసిన తర్వాతే ముద్రిస్తారని, దీనివల్ల నకిలీ సమాచారం ఉండే అవకాశం తక్కువని అన్నారు. అలాంటి వార్తలు పాఠకులపై ప్రభావం చూపిస్తాయన్నారు.
కానీ సోషల్ మీడియా అలా కాదని, సరైన పరిశీలన ఉండదు కాబట్టి అందులో షేర్ చేసే వార్తలపై జాగ్రత్తగా ఉండాలన్నారు. పాత్రికేయులు నిష్పక్షపాతంగా ఎలాంటి పరిస్థితుల్లోనూ రాజీ పడకుండా స్వేచ్ఛగా వార్తలు రాయాలని ప్రణబ్ సూచించారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు నిరంతరం కృషి చేస్తున్న నాలుగో ఎస్టేట్ అయిన మీడియాను ఆయన ప్రశంసించారు. సామాజిక మాధ్యమాల ద్వారా కొందరు వ్యక్తులు పంపే నకిలీ సమాచారం కారణంగా సమాజంలో అల్లర్లు చెలరేగే ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే అమాయకులైన ప్రజలు వాటిని నమ్మి షేర్ చేస్తారు, కాబట్టి ఇలాంటి వార్తలను దృష్టికి వచ్చినపుడు జాగ్రత్త వహించాలని సూచించారు.