Modi-Jagan: ప్రధాని మోదీతో సీఎం జగన్ భేటీ.. నేటి సాయంత్రం అమిత్ షాతోనూ సమావేశం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీలో బిజీబిజీగా ఉన్నారు. నిన్న రాత్రి గన్నవరం విమానాశ్రయం నుంచి విమానంలో ఆయన ఢిల్లీ వెళ్లిన విషయం తెలిసిందే. తన ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీతో జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మోదీకి వేంకటేశ్వర స్వామి ప్రతిమను జ్ఞాపికగా అందించారు. ఏపీకి రావాల్సిన పెండింగ్ నిధులు మంజూరు చేయాలని జగన్ కోరినట్లు తెలుస్తోంది.

Modi-Jagan
Modi-Jagan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీలో బిజీబిజీగా ఉన్నారు. నిన్న రాత్రి గన్నవరం విమానాశ్రయం నుంచి విమానంలో ఆయన ఢిల్లీ వెళ్లిన విషయం తెలిసిందే. తన ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీతో జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మోదీకి వేంకటేశ్వర స్వామి ప్రతిమను జ్ఞాపికగా అందించారు. ఏపీకి రావాల్సిన పెండింగ్ నిధులు మంజూరు చేయాలని జగన్ కోరినట్లు తెలుస్తోంది.
అలాగే, పోలవరం ప్రాజెక్టుకు నిధులు, ఏపీలో మూడు రాజధానులపై చర్చించినట్లు సమాచారం. ప్రధాని మోదీతో సమావేశంలో పాల్గొన్న అనంతరం కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ తో జగన్ సమావేశమయ్యారు. దాదాపు 40 నిమిషాల పాటు వీరిద్దరి మధ్య సమావేశం కొనసాగింది. రుషికొండ, పెండింగ్ ప్రాజెక్టులకు అనుమతుల విషయంపై జగన్ చర్చించారు.
ఇవాళ సాయంత్రం కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో జగన్ సమావేశం కానున్నారు. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన పలు అంశాలపై ఆయన చర్చించనున్నారు. ఈ నెలలో జగన్ ఢిల్లీకి వెళ్లడం ఇది రెండోసారి. జీ20 సదస్సును వచ్చే ఏడాది సెప్టెంబరులో భారత్ లో నిర్వహించాల్సి ఉన్న నేపథ్యంలో కొన్ని రోజుల క్రితం ప్రధాని మోదీ నిర్వహించిన అఖిలపక్ష భేటీలో జగన్ పాల్గొన్న విషయం తెలిసిందే. అనంతరం ప్రధాని మోదీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లోనూ జగన్ పాల్గొన్నారు.
కాగా, ‘‘రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో చర్చించాను. రాష్ట్ర విభజన హామీలు నెరవేర్చాలని, ప్రత్యేక హోదాతో పాటు పలు పెండింగ్ అంశాలను పరిష్కరించాలని కోరాను. ప్రధాని సానుకూలంగా స్పందించారు’’ అని జగన్ ఇవాళ ట్వీట్ చేశారు.