Lance Naik Sai Teja: అమరుడు సాయితేజ మృతదేహం కోసం ఎదురుచూపులు
చిత్తూరు జిల్లాకు చెందిన వీరజవాన్ సాయితేజ మృతదేహం కోసం అతని కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారు.
Lance Naik Sai Teja: చిత్తూరు జిల్లాకు చెందిన వీరజవాన్ సాయితేజ మృతదేహం కోసం అతని కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే సాయితేజ తల్లిదండ్రులు, సాయితేజ పిల్లల బ్లడ్ శాంపిల్స్ సేకరించారు ఆర్మీ అధికారులు. ఇవాళ ఉదయం డెడ్బాడీలకు డీఎన్ఏ టెస్ట్ చేయనుండగా.. రిపోర్ట్ వచ్చాక సాయంత్రం వరకు సాయితేజ మృతదేహాన్ని పంపిస్తామని అధికారులు వెల్లడించారు.
సాయితేజ మృతితో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. ఆర్మీలోనే పనిచేస్తున్న సాయితేజ తమ్ముడు మహేశ్బాబు ఇంటికి చేరుకున్నారు. తన అన్నను తలుచుకొని కన్నీటి పర్యంతం అయ్యారు. తన అన్న లేని లోటు పూడ్చలేనిదని వెక్కివెక్కి ఏడుస్తున్నారు. మరణ వార్తను మొదట నమ్మలేకపోయాయని, నిజమని నమ్మడానికి చాలా సమయమే పట్టిందన్నారు మహేశ్బాబు.
అన్న మరణ వార్త విని తట్టుకోలేనంత వేదనకు గురవుతున్నామని అన్నారు. తాను ఆర్మీలో చేరడానికి అన్నయ్యే స్పూర్తి అని తెలిపారు మహేశ్. హెలికాప్టర్ ప్రమాదంలో మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా ఉన్నాయని అధికారులు చెప్పగానే ఏడుపు ఆగలేదన్నారు. 10టీవితో ప్రత్యేకంగా మాట్లాడిన సాయి తేజ్ తమ్ముడు మహేశ్.. డిఎన్ఏ ద్వారా మృతదేహం నిర్ధారణ ఆలస్యం అవుతోందని, అన్నయ్యకు ఒంటిపై మూడు చోట్ల పచ్చబొట్లు ఉన్నాయని, చేతిపైన రెండు, ఛాతీపైన ఒకటి అని అధికారులకు చెప్పినట్లు చెప్పారు. పచ్చ బొట్ల ఫోటోలు అధికారులకు పంపామని, వీలైతే వాటి ద్వారా మృతదేహం గుర్తించమని చెప్పామని వెల్లడించారు.
సాయితేజ కుటుంబాన్ని మా అధ్యక్షుడు మంచు విష్ణు ఫోన్లో పరామర్శించారు. సాయితేజ కుటుంబానికి అండగా ఉంటామన్నారు మంచు విష్ణు. ఇద్దరు పిల్లలను తానే చదివిస్తానని హామీ ఇచ్చారు. పదిరోజుల్లో వచ్చి కలుస్తానని చెప్పారు మంచు విష్ణు.