ఇవాళ్టి నుంచి ఈ వస్తువుల ధరలు తగ్గాయి
23రకాల వస్తువులపై జీఎస్టీ తగ్గిస్తూ జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో 2019, జనవరి 1 మంగళవారం నుంచి ఆ వస్తువుల ధరలు తగ్గాయి. సినిమా టికెట్లు, టీవీలు, మానిటర్లు, పవర్బ్యాంకులు, నిల్వచేసిన కూరగాయల ధరలు తగ్గాయి. 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించిన ట్యాక్స్ లిస్ట్లో ట్రాన్స్మిషన్ షాఫ్ట్, పునర్వినియోగ టైర్లు, లిథియం అయాన్ పవర్ బ్యాంకులు, డిజిటల్ కెమెరాలు, వీడియో కెమెరా రికార్డర్లు, వీడియో గేమ్ పరికరాలున్నాయి. దివ్యాంగుల ఉపకరణాలపై ప్రస్తుతం అమలవుతున్న పన్నును 28 శాతం నుంచి 5 శాతానికి కుదించారు.
* 5శాతం శ్లాబులో: ఊత కర్ర, ఫ్లైయాష్ ఇటుకలు, సహజ బెరడు, చలువరాళ్లు
* పుణ్యక్షేత్రాలకు ప్రభుత్వం సమకూర్చే నాన్ షెడ్యూల్డ్, చార్టర్డ్ విమానాల సేవలు
* పునర్వినియోగ ఇంధన ఉపకరణాలు, వాటి తయారీ
* పన్ను మినహాయింపు: శీతలీకరించిన, ప్యాక్ చేసిన కూరగాయలు, రసాయనాలతో భద్రపరచిన, తక్షణం తినడానికి సిద్ధంగా లేని కూరగాయలు
* జన్ధన్ యోజన ఖాతాదారులకు బ్యాంకులు అందించే సేవలు
* ఇక నుంచి 28శాతం జీఎస్టీ శ్లాబులో విలాసవంతమైన వస్తువులు మాత్రమే
* సరకు రవాణ వాహనాల థర్డ్ పార్టీ బీమా ప్రీమియం 18 నుంచి 12శాతానికి తగ్గింపు