ఐసిస్ ఉగ్రవాదులకు నగదు,ఆయుధాలు సప్లై చేస్తున్న బెంగుళూరు డాక్టర్ అరెస్ట్
ఉగ్రవాదుల కనుసన్నల్లో నడిచే దేశాలకు తప్ప ప్రపంచ దేశాలన్నింటికి ఐసిస్ అంటే శతృవువే. ఐసిస్ ను తుదముట్టించటానికి భారత్ తో సహా పలు దేశాలు యత్నిస్తున్నాయి. ఈ క్రమంలో ఐసిస్ ఉగ్రవాదులకు బెంగుళూరులోని ఓ డాక్టర్ సహాయం చేస్తున్నట్లుగా తెలిసింది. దీంతో ఎన్ఐఏ అధికారులను ఆ డాక్టర్ ను అరెస్ట్ చేశారు. అనంతరం విచారణ కొనసాగిస్తున్నారు. అతన్నుంచి సమాచారం సేకరించారు. ఇంకా పలు కీలక అంశాలపై ప్రశ్నిస్తోంది ఎన్ఐఏ.
వివరాల్లోకి వెళితే.. బెంగుళూరుకు చెందిన అబ్దల్ రెహ్మాన్ అనే 28 ఏళ్ల డాక్టర్ కు ఐసిస్తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని పక్కా సమాచారంతో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అబ్దుర్ రెహ్మాన్ ను అదుపులోకి తీసుకోవటం స్థానికంగా సంచలనం సృష్టించింది.
దీనిపై ఎన్ఐఏ అధికారి మాట్లాడుతూ..అబ్దల్ రెహ్మాన్ ఉగ్రవాదులకు నగదు సహాయంతో పాటు వైద్య, ఆయుధ సహాయం అందిస్తున్నారని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం అతడు బెంగళూరులోని ఎం.ఎస్. రామయ్య మెడికల్ కాలేజీలో డాక్టర్గా పనిచేస్తున్నాడనీ..ఇస్లామిక్ స్టేట్ ఖోరాసన్ ప్రావిన్స్ (ఐఎస్కేపీ) సంస్థతో కలిసి పనిచేస్తున్నాడని అధికారులు తెలిపారు. అబ్దుల్ రెహమాన్ 2014 ప్రథమార్థంలో సిరియాలో ఏర్పాటుచేసిన ఐసిస్ మెడికల్ క్యాంప్కు హాజరయ్యాడని, అక్కడ ఉగ్రవాదులకు పది రోజులపాటు వైద్యం చేశాడని, అనంతరం భారత్కుతిరిగి వచ్చాడని..చాలా కాలంగా ఐసీస్ ఉగ్రవాదులతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నాడనే సమాచారం అందిందనీ దీంతో అతనిపై నిఘా పెట్టి..పక్కా ప్లాన్ ప్రకారం అరెస్ట్ చేశామని తెలిపారు.
గత మార్చిలో ఢిల్లీ పోలీసులు ఐఎస్కేపీపై మొదటిసారిగా కేసు నమోదుచేశారని, ఇందులో భాగంగా దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న కశ్మీర్కు చెందిన దంపతులు జాహ్నజైబ్ సమి వని, హీనా బషీర్ బేగ్లను అరెస్టు చేశారు. వీరికి ఐసీస్ దుబాయ్ శాఖకు చెందిన సభ్యుడు అబ్దుల్లా బషీద్తో సంబంధాలున్నట్లు తెలిపారు. ఈ కేసు విచారణ సందర్భంగా అబ్దుల్ రెహమాన్ ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించి సమీతో నిరంతరం సంభాషిస్తున్నట్లు తేలిందని చెప్పారు. గాయపడిన ఐసిస్ కార్యకర్తల కోసం ఓ అప్లికేషన్ తయారు చేసినట్టుగా గుర్తించారు. 2014లో సిరియాలో కూడా అతడు వైద్యం అందించాడని తేల్చారు.