ఖమ్మంలో కార్పోరేటర్ పై తిరగబడ్డ ప్రజలు
ఖమ్మం నగరంలోని ఒకటో డివిజన్ కార్పోరేటర్ ప్రజాగ్రహానికి గురయ్యారు. ఆయనపై ఆగ్రహించిన ప్రజలు కార్పోరేటర్ వాహనాన్ని తగుల బెట్టారు. ఒకటో డివిజన్ కార్పోరేటర్ ధరావత్ రామ్మూర్తి నాయక్ పై జనం తిరగబడ్డారు. కైకొండాయ గూడెంనకు చెందిన అనంద్ తేజ(23) ఆగస్ట్ 18 న జలగం నగర్ లోని కార్పొరేటర్ రామ్మూర్తి ఫంక్షన్ హాల్లో వెల్డింగ్ పనులకు వెళ్లి..అనుమానాస్పదంగా మృతి చెందాడు.దీనికి కార్పోరేటర్ రామ్మూర్తినాయక్ కారణమని ఆరోపిస్తూ మృతుని తల్లి తండ్రులు, బంధువులు ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత కార్పొరేటర్కు, మృతుడి కుటుంబ సభ్యులకు మధ్య చర్చలు జరగ్గా విఫలమైనట్లు తెలిసింది. ఈ క్రమంలో మంగళవారం తన డివిజన్ పరిధిలోని కైకొండాయిగూడెం హైస్కూల్లో ఆన్లైన్ క్లాసులు ప్రారంభించిన రామ్మూర్తి అనంతరం ప్రాథమిక పాఠశాలకు వచ్చారు.
https://10tv.in/karnataka-fadher-sells-3-month-old-daughter-for-rs-1-lakh-buys-motorcycle-mobile-phone/
విషయం తెలిసిన మృతుడి తల్లి తండ్రులు, స్ధానికులు పాఠశాల వద్దకు వచ్చారు. అక్కడ కార్పోరేటర్… మృతుడి తల్లితండ్రులు మాట్లాడుకుంటుండగా…సహనం కోల్పోయిన కార్పోరేటర్ వారిని దూషించాడు. దీంతో ఆగ్రహించిన మృతుడి బంధువులు రామ్మూర్తి వాహనంపై దాడి చేయటంతో, రామ్మూర్తి సమీపంలోని స్కూల్ లోకి వెళ్లి తలుపు వేసుకున్నారు. బంధువులు గదిబయట తాళం వేశారు. వాతావరణం ఉద్రిక్తంగా మారటంతో స్కూల్లోని సిబ్బంది కూడా మరో గదిలోకి వెళ్లి దాక్కున్నారు.
సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని రామ్మూర్తి నాయక్ను, స్థానిక గ్రామ పెద్ద గుర్రం వెంకటరామయ్యతో కలిసి బందోబస్తు నడుమ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఆ తర్వాత టూ టౌన్ సీఐ గోపి ఆందోళనకారులను సముదాయించి కార్పొరేటర్ కారును డ్రైవర్ ద్వారా పంపిస్తుండగా..ఆందోళనకారులు కర్రలు, రాళ్లతో దాడి చేశారు. భయాందోళన చెందిన డ్రైవర్ దిగి పారిపోగా..ఆ తర్వాత పెట్రోల్ పోసి నిప్పంటించారు.
పోలీసుల సమాచారంతో ఫైరింజన్ అక్కడికి చేరుకోగా..అప్పటికే దాదాపు పూర్తిగా ధ్వంసమైంది. ఒక ఏసీపీ, ముగ్గురు సీఐలు, పోలీసు బలగాలతో ఉన్న సమయంలోనే కారును తగలబెట్టడం చూస్తే గ్రామస్తుల ఆగ్రహం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చని స్థానికులు అంటున్నారు. దాదాపు ఉదయం గం.10-30లనుంచి మధ్యాహ్నం 2 గంటలవరకు సాగిని ఈ హై డ్రామాతో గ్రామం ఉద్రిక్తంగా మారింది.