Telangana : మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర.. పోలీసుల రిమాండ్ రిపోర్ట్లో కీలక విషయాలు.
హత్యకు కుట్ర కేసులో పోలీసుల రిమాండ్ రిపోర్ట్ లో కీలక విషయాలు వెల్లడించారు. ఆరు నెలల క్రితమే మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు ప్లాన్ చేసినట్లు, నవంబర్ లో డబల్ మర్డర్ కేసులో..
Conspiracy On Minister Srinivas Goud : తెలంగాణలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఏకంగా మంత్రి హత్యకు కుట్ర పన్నడం సంచలనంగా మారింది. తెలంగాణ కేబినెట్లో కీలకంగా వ్యవహరిస్తున్న మంత్రి శ్రీనివాస్గౌడ్పై జరిగిన హత్య కుట్రను ఛేదించారు పోలీసులు. మహబూబ్నగర్కు చెందిన వ్యక్తులు మంత్రి శ్రీనివాస్గౌడ్ను హత్య చేసేందుకు ఫరూఖ్ అనే వ్యక్తికి 15 కోట్ల సుపారీ ఆఫర్ చేశారు. అయితే హత్య కుట్రపై ఫరూక్ పేట్బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో యాదయ్య, విశ్వనాథ్, నాగరాజును అరెస్ట్ చేశారు పోలీసులు. ఇదిలా ఉంటే…హత్యకు కుట్ర కేసులో పోలీసుల రిమాండ్ రిపోర్ట్ లో కీలక విషయాలు వెల్లడించారు. ఆరు నెలల క్రితమే మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు ప్లాన్ చేసినట్లు, నవంబర్ లో డబల్ మర్డర్ కేసులో నిందితుడిగా ఉన్న ఫరూక్ కోసం రఘు అండ్ నాగరాజు గ్యాంగ్ వెతికినట్లుగా వెల్లడించారు.
Read More : Srinivas Goud : మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర.. రూ.15 కోట్లకు సుపారీ
ఫరూక్ గతంలో ఒకే రోజు ఇద్దరిని చంపడంతో అతడిని రఘు అండ్ నాగరాజు గ్యాంగ్ ఎంచుకుంది. నవంబర్ 18 న ఫరూక్ ను కలిసిన నాగరాజు, రఘు… చంపేందుకు ఆయుధాలు సమకూర్చాలని ఫరూక్ ని నిందితులు కోరినట్లుగా పేర్కొన్నారు. ఫరూక్, హైదర్ అలీలు ఇద్దరు మిత్రులు. ఆయుధాలు సమకూర్చాలని పదే పదే ఫరూక్ కు ఫోన్ చేసినట్లుగా పోలీసులు తేల్చారు. తనకి ఉన్న ప్రాణహాని ఉందని హైదర్ ఆలీ గ్రహించినట్లు, తనని ఈ కుట్ర నుండి కాపాడాలని ఫరూక్ ను అతను కోరినట్లుగా నిర్ధారించారు. ఫిబ్రవరి 23వ తేదీన సుచిత్ర వద్ద లాడ్జ్ లో హైదర్ అలీ, ఫరూక్ లు దిగారు. వీరి మూమెంట్స్ నాగరాజు, రఘు తెలుసుకున్నారు. ఫిబ్రవరి 25వ తేదీన లాడ్జ్ నుండి బయటికి వచ్చిన ఫరూక్, హైదర్ ఆలీలపై కత్తులతో నాగరాజు తదితరులు దాడికి పాల్పడ్డారు.
Read More : Srinivas Goud : కేసీఆర్ను టచ్ చేస్తే దేశమే భగ్గుమంటుంది, పేదల అకౌంట్లో రూ.15లక్షలు ఎక్కడ?
అక్కడి నుండి ఎలాగో తప్పించుకున్న హైదర్, ఫరూఖ్ లు పెట్ బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నాగరాజు, రఘు, విశ్వనాథ్, యాదయ్యల పై ఫిబ్రవరి 25వ తేదీన ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. ఫిబ్రవరి 26వ తేదీన నాగరాజు, యాదయ్య, విశ్వనాథ్ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర పన్నిన నాగరాజు, విశ్వనాథ్, యాదయ్యను అరెస్ట్ చేసినట్టు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర ప్రకటించారు. మరో ప్రధాన నిందితుడు రఘు పరారీలో ఉన్నారని వివరించారు. మంత్రి శ్రీనివాస్గౌడ్ హత్యకు మధు సుధన్ రాజు, అమరేంద్ర రాజు 15 కోట్లను సుపారీ గ్యాంగ్కు ఆఫర్ చేశారని తెలిపారు స్టీఫెన్ రవీంద్ర. ఇప్పటివరకు 8 మందిని అరెస్ట్ చేశామన్నారు. రాఘవేందర్రాజు, మున్నూరు రవితో పాటు మరో ముగ్గురు ఢిల్లీలో ఉన్నట్టు ట్రేస్ చేశామన్నారు. ఢిల్లీలోని బీజేపీ నేత జితేందర్ రెడ్డి ఇంట్లో వారిని అదుపులోకి తీసుకున్నామన్నారు. నిందితుల నుంచి రివాల్వర్, మొత్తం 6 రౌండ్ల బుల్లెట్స్ స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులు యూపీ నుంచి ఆయుధాలు సమకూర్చుకున్నట్టు తెలిపారు స్టీఫెన్ రవీంద్ర. ఈ హత్య కుట్రలో జితేందర్ పాత్రపై విచారిస్తున్నట్టు స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. డీకే అరుణ అనుచరులపై కూడా అనుమానాలు ఉన్నాయన్నారు. హత్య కుట్రపై శ్రీనివాస్గౌడ్కు తెలియజేశామన్నారు. టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారన్నారు.