Missing boy died: అనీశ్ కథ విషాదాంతం.. హైదర్ గూడలో అదృశ్యమైన బాలుడు మృతి..!

హైదర్ గూడలో నిన్న మధ్యాహ్నం అదృశ్యమైన బాలుడు.. చనిపోయాడు. ఇంటి వెనకే ఉన్న చిన్నపాటి చెరువు కుంటలో మృతదేహంగా కనిపించాడు.

Missing boy died: అనీశ్ కథ విషాదాంతం.. హైదర్ గూడలో అదృశ్యమైన బాలుడు మృతి..!

Aneesh

హైదర్ గూడలో నిన్న అదృశ్యమైన బాలుడు అనీశ్ కథ విషాదాంతమైంది. ఆ చిన్నారి.. ఇంటి వెనకే ఉన్న చెరువులో మృత దేహంగా కనిపించాడు. ఆడుకుంటూ అదుపు తప్పి చెరువులో పడిపోయాడా.. లేక ఎవరైనా హత్య చేశారా.. అన్నది తేలాల్సి ఉంది. చెరువు గట్టున అనీశ్ బట్టలు ఉండడంపై.. అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

నిన్న మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో ఆడుకుంటూ ఇంటి నుంచి బయటికి వచ్చిన అనీశ్.. కనిపించకుండా పోయాడు. అన్నం తినిపించేందుకు బయటికి వచ్చి చూసిన తల్లిదండ్రులకు అనీశ్ కనిపించకపోవడంతో.. ఆందోళనకు గురయ్యారు. చాలాసేపు అనీశ్ కోసం వెతికారు. ఫ్రెండ్స్ తో కలిసి ఆడుకోవడానికి వెళ్లాడేమో అని చాలాసేపు ఎదురు చూశారు. చివరికి అనుమానంతో పోలీసులను ఆశ్రయించారు.

అప్పటినుంచి.. పోలీసులు అనీశ్ ఆచూకీ గురించి ఆరా తీశారు. ఎవరిపై అనుమానాలు లేవని తల్లిదండ్రులు చెప్పిన తర్వాత.. అనీశ్ ను గుర్తించేందుకు పోలీసులు అన్ని విధాలుగా ప్రయత్నించారు. సీసీ టీవీ ఫూటేజ్ వివరాలు పరిశీలిస్తున్నారు. బాలుడు మిస్ అయిన తర్వాత కొన్ని సీసీ కెమేరాలు పని చేయని విషయాన్ని గుర్తించారు. ఇంటికి అన్నివైపులా పరిశీలించిన పోలీసులు.. చివరికి చెరువు గుంతలో అతని మృతదేహాన్ని గుర్తించారు.

జరిగిన పరిస్థితులపై.. తల్లిదండ్రులు కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సీసీ టీవీలు పని చేయకపోవడంపై వారు డౌట్ పడుతున్నారు. పోలీసులు కూడా.. ఆ దిశగా పూర్తి సమాచారం తెలుసుకునేలా దర్యాప్తును కొనసాగిస్తున్నారు. మరోవైపు.. బాలుడి కుటుంబం ఉంటున్న ఇంటికి 30 మీటర్ల దూరంలోనే కుంట ఉందని.. పోలీసులు చెబుతున్నారు. ఇటీవల వర్షాల కారణంగా ఆ కుంటలో నీళ్లు నిండి ఉన్నాయన్నారు. క్లూస్ టీమ్స్ దర్యాప్తు చేస్తాయన్నారు.