ఇంటర్ బోర్డు లీలలు : అరబిక్ రాస్తే ఉర్దూలో రిజల్ట్.. అదీ సున్నా మార్కులు
ఇంటర్మీడియట్ ఫలితాల్లో బోర్డ్ చేసిన నిర్వాకానికి రాష్ట్రంలోని విద్యార్ధులంతా గందరగోళానికి గురయ్యారు. టాపర్స్ లను కూడా ఫెయిల్ అయ్యారని వెల్లడించటం బోర్డ్ నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. దీంతో ఆందోళనలకు గురైన విద్యార్ధులు..వారి తల్లిదండ్రలు ఇంటర్ బోర్డ్ ఆఫీస్ వద్ద ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. ఈక్రమంలో పరీక్షకు హాజరైనవారికి పరీక్షే రాయనట్లు..రాయనివారు పరీక్ష రాసినట్లుగా కూడా బోర్డ్ నిర్లక్ష్యానికి నిదర్శనంగా కనిపిస్తోంది.
ఈ క్రమంలో ఓ విద్యార్థినికి తాను రాసిన పరీక్షలు రాయనట్లుగా..రాయని సబ్జెక్టు రాసినట్లుగా ఇంటర్ ఫలితాల్లో వెల్లడయ్యాయి. దీంతో ఆమె ఆశ్చర్యపోయింది. నల్గొండ పట్టణం బీటీఎస్కు చెందిన ఎండీ.నౌషిన్ హైదరాబాద్లోని హయత్నగర్ ప్రభుత్వ జూనియర్ కాలేజ్ లో 2018లో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసింది. యూనాని మెడిసిన్ కోసం ఈ 2019 మార్చిలో అరబిక్ పేపర్ – 1, 2 పరీక్షలు (ఎక్స్టర్నల్ లాంగ్వేజ్) రాసింది. కానీ ఇంటర్ ఫలితాల్లో మాత్రం నౌషిన్ రాసిన పరీక్షల పేపర్లు కాకుండా ఉర్దూ పేపర్-1, 2 రాసినట్లు రావటమే కాక ఆ పరీక్షల్లో 0 మార్కులు వచ్చినట్లు ఇంటర్నెట్ లిస్ట్ లో రావటంతో నౌషిన్ నివ్వెరపోయారు..కంగారుపడింది.
తాను రాసిన అరబిక్ పేపర్- 1, 2లలో కనీసం 90 మార్కులు వస్తాయని..తాను ఆ పరీక్షలు అంతా బాగా రాసానననీ కానీ తనకు 0 మార్కులు రావటమేంటని ఆందోళన పడింది. ఈ సబ్జెక్టుల్లో మంచి మార్కులు వస్తే యూనాని మెడిసిన్ చేరదామని అనుకున్న నౌషిన్ వాపోయింది. ఇప్పుడేం చేయాలో అర్థం కావటంలేదంటు వాపోయింది. ప్రస్తుతం రీవాల్యుయేషన్కు అప్లై చేసుకున్నానని తెలిపింది. తనకు జరిగిన అన్యాయంపై కుటుంబసభ్యులతో కలిసి గత రెండు రోజులుగా ఇంటర్ బోర్డు ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నా ఎవ్వరూ పట్టించుకోవటంలేదంటు నౌషిన్ వాపోయింది. కాగా ఇటువంటి విద్యార్ధుల పరిస్థితికి అటు ఇంటర్ బోర్డ్, ఇటు ప్రభుత్వం ఏంచేస్తుంది చూడాలి.