హైదరాబాద్ కింగ్ కోఠిలో హైటెన్షన్, కరోనా సోకిన వ్యక్తి ఇంట్లో 48మంది పరిస్థితి ఏంటి?

  • Published By: sreehari ,Published On : April 5, 2020 / 02:08 AM IST
హైదరాబాద్ కింగ్ కోఠిలో హైటెన్షన్, కరోనా సోకిన వ్యక్తి ఇంట్లో 48మంది పరిస్థితి ఏంటి?

కరోనా వైరస్ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. కరోనా లక్షణాలు కనిపించేవరకు ఎవరికి ఉందో లేదో గుర్తించలేని పరిస్థితి. ఢిల్లీలో కరోనా విస్పోటనంతో దాదాపు 17 రాష్ట్రాల్లో వందల వరకు కేసులు నమోదు కావడం ఆందోళనకు గురిచేస్తోంది. హైదరాబాద్ నగరంలోని కింగ్ కోఠి ప్రాంతంలో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్ర కలకలం రేపింది. ఈ ప్రాంతంలో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ అని రావడంతో అసలు భయం మొదలైంది.

అంతేకాదు.. అతడు నివాసంలో 48 మంది కుటుంబ సభ్యులు ఉండటం మరింత భయాందోళనకు గురిచేస్తోంది. ఒక వ్యక్తికి కరోనా సోకితే అతడితో కలిసి ఉన్న వ్యక్తులకు వైరస్ వ్యాపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాంటిది ఒకే ఇంట్లోనే ఇంతమంది ఉండటంపై చుట్టుపక్కల ప్రాంతాలవారిని భయాందోళనకు గురిచేస్తోంది. 

అతడికి కరోనా పాజిటివ్ తేలడంతో మిగతా 48 మంది కుటుంబ సభ్యులకు కూడా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీలో జరిగిన మర్కజ్ ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారు ఎవరో గుర్తించే పనిలో అధికారులు ఉన్నారు. అనుమానం వచ్చిన ప్రతిఒక్కరిని పరీక్షిస్తున్నారు. నగరంలోని ఈ ప్రాంతానికి చెందిన ఆరుగురు వ్యక్తులు మార్చి 12న విమానంలో ఢిల్లీ వెళ్లారు. మార్చి 18న తిరిగి నగరానికి వచ్చారు. నాలుగు రోజుల క్రితమే అధికారులు వీరిని గుర్తించారు. అమీర్ పేటలోని నేచర్ క్యూర్ ఆస్పత్రికి తరలించి పరీక్షలు నిర్వహించారు. వీరిలో ఒకరికి పాజిటివ్ తేలింది. 

అయితే కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తి ఇంట్లో 48 మంది కుటుంబ సభ్యులు ఉంటారని తెలిసి అధికారులు నివ్వెరపోయారు. అతడి ఇంట్లో మొత్తం 48 మంది ఉంటారు. ఇతడితోపాటు మరో ఐదుగురి ఇంట్లో కూడా 20 మంది వరకు ఉంటున్నారని అధికారులు గుర్తించారు.

ప్రస్తుతానికి వీళ్లందరికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. వీరిలో ఎవరికైనా వైరస్ సోకిందా? లేదా అనేది టెస్టుల ఫలితాలు వస్తేగానీ చెప్పలేం.. ఏదిఏమైనా.. ఇప్పటికే తెలంగాణలో కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్న తరుణంలో పెద్ద మొత్తంలో వీరికి కూడా కరోనా సోకితే పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం లేకపోలేదు..