టి.అసెంబ్లీ : 4 ఏళ్లలో ఎంతో అభివృద్ధి – కొప్పుల
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. జనవరి 20వ తేదీ చివరి రోజైన ఆదివారం శాసనసభలో సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి, శాసనమండలిలో చైర్మన్ స్వామిగౌడ్ సమావేశాలకు అధ్యక్షత వహించారు. శాసనసభలో కొప్పుల ఈశ్వర్, శాసనమండలిలో పల్లా రాజేశ్వర్ రెడ్డి గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదం తెలిపే తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీనిపై కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ…తెలంగాణ రాష్ట్రం ఆవిర్భమైన అనంతరం అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని..కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. ఈ ఫలాలు ప్రజలకు అందాయి కాబట్టే..మరోసారి టీఆర్ఎస్కి ప్రజలు పట్టం కట్టారని…గత నాలుగేళ్లలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి సాధించిందన్నారు. గవర్నర్ ప్రసంగం రాష్ట్రాభివృద్ధికి అద్దం పట్టిందని…కోటి ఎకరాలకు నీరందించాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ ముందుకు సాగుతున్నారని సభకు తెలిపారు. రైతు బంధు పథకం దేశానికే ఆదర్శంగా నిలిచిందని…ఇతర రాష్ట్రాలు కూడా ఈ పథకాన్ని అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.