Tirumala Tirupati: ‘మార్చి నుంచి 6 నెలలపాటు శ్రీవారి దర్శనాలు నిలుపుదల’ అంటూ అసత్య ప్రచారం: ప్రధానార్చకుడు శ్రీ వేణుగోపాల దీక్షితులు

ఆరు నెలల పాటు శ్రీవారి మూలమూర్తి దర్శనం ఉండదని కొన్ని ప్రసార మాధ్యమాలు, సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోందని దీక్షితులు తెలిపారు. ఈ దుష్ప్రచారాన్ని భక్తులు నమ్మవద్దని టీటీడీ విజ్ఞప్తి చేస్తోందని అన్నారు.

Tirumala Tirupati: ‘మార్చి నుంచి 6 నెలలపాటు శ్రీవారి దర్శనాలు నిలుపుదల’ అంటూ అసత్య ప్రచారం: ప్రధానార్చకుడు శ్రీ వేణుగోపాల దీక్షితులు

Tirumala Tirupati: తిరుమల శ్రీవారి ఆలయంలో ఆనందనిలయం బంగారు తాపడం పనుల కోసం స్వామివారి దర్శనాన్ని ఆరు నెలల పాటు నిలిపివేస్తారని కొన్ని ప్రసార మాధ్యమాల్లో వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకుల్లో ఒకరైన శ్రీ వేణుగోపాల దీక్షితులు చెప్పారు. టీటీడీ ఆగమ సలహా మండలి సూచనల మేరకు తిరుమల శ్రీవారి ఆలయ ఆనంద నిలయం బంగారు తాపడం పనులు ప్రారంభించి 6 నెలల్లో పూర్తి చేయాలని టీటీడీ ధర్మకర్తల మండలి నిర్ణయించిందని అన్నారు.

ఈ మేరకు బాలాలయం ఏర్పాటుకు ఆలయ అర్చకులు 2023, మార్చి1న తేదీని ముహూర్తంగా నిర్ణయించారని చెప్పారు. ముందుగా వారం రోజులపాటు బాలాలయ నిర్మాణానికి అవసరమైన వైదిక క్రతువులు నిర్వహిస్తారని అన్నారు. ఇందులోభాగంగా గర్భాలయంలోని మూలమూర్తి జీవకళలను కుంభంలోకి ఆవాహన చేసి బాలాలయంలో ఏర్పాటు చేసే దారు(కొయ్య) శ్రీ వేంకటేశ్వర స్వామివారి విగ్రహంలోకి ప్రవేశపెడతారని వివరించారు.

ఆ తర్వాత ఆనంద నిలయానికి బంగారు తాపడం పనులు చేపడతారని, ఇందుకోసం పట్టే ఆరు నెలల సమయంలో గర్భాలయంలోని మూలమూర్తిని భక్తులు యథావిధిగా దర్శించుకోవచ్చని తెలిపారు. బాలాలయంలోని దారు విగ్రహాన్ని కూడా భక్తులు దర్శించుకోవచ్చని చెప్పారు. గర్భాలయంలో మూలమూర్తికి ఆర్జిత సేవలు ఏకాంతంగా నిర్వహిస్తారని అన్నారు.

గర్భాలయంలో మూలమూర్తికి, బాలాలయంలోని దారు విగ్రహానికి ఉదయం సుప్రభాతం నుంచి రాత్రి ఏకాంత సేవ వరకు అన్ని ఆర్జిత సేవలు ఆగమోక్తంగా నిర్వహిస్తారని తెలిపారు. ఉత్సవమూర్తులైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి వారికి నిర్వహించే కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం సేవలన్నీ యథావిధిగా జరుగుతాయని చెప్పారు. 1957-58వ సంవత్సరంలో ఆనంద నిలయానికి బంగారు తాపడం జరిగిన సందర్భంలో, 2018వ సంవత్సరంలో శ్రీవారి ఆలయంలో బాలాలయం నిర్వహించిన సందర్భంలో ఉన్న రికార్డుల ప్రకారం భక్తులకు శ్రీవారి మూలమూర్తి దర్శనం, ఉత్సవమూర్తులకు కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం తదితర సేవలు నిర్వహించారని అన్నారు.

వాస్తవం ఇలా ఉండగా, కొన్ని ప్రసార మాధ్యమాలు, సామాజిక మాధ్యమాల్లో మాత్రం ఆరు నెలల పాటు శ్రీవారి మూలమూర్తి దర్శనం ఉండదని ప్రచారం జరుగుతోందని తెలిపారు. ఈ దుష్ప్రచారాన్ని భక్తులు నమ్మవద్దని టీటీడీ విజ్ఞప్తి చేస్తోందని ఓ ప్రకటనలో శ్రీ వేణుగోపాల దీక్షితులు అన్నారు.

Telangana : అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై కేసు నమోదు