మహారాష్ట్రలో మరోసారి చెలరేగుతున్న కరోనా వేవ్

మహారాష్ట్రలో మరోసారి చెలరేగుతున్న కరోనా వేవ్

Maharashtra Covid Cases: మరోసారి మహారాష్ట్రలో కరోనా వేవ్ చెలరేగిపోతుంది. గ‌త 24 గంట‌ల్లో 4 వేల పాజిటివ్ కేసులు న‌మోదు అవగా.. ఒక్క రోజులోనే 40 మంది మ‌ర‌ణించారు. వీటితో ఇప్ప‌టి వ‌ర‌కు మ‌హారాష్ట్రలో వైరస్ సోకిన వారి సంఖ్య 20లక్షల 64వేల 278కి చేరింది. మొత్తం మ‌ర‌ణాల సంఖ్య 51వేల 529కి చేరుకున్నట్లు సెంట్రల్ హెల్త్ డిపార్ట్‌మెంట్ వెల్ల‌డించింది. ఆదివారం ఒక్క రోజులోనే సుమారు 1355 మంది రోగుల‌ను డిశ్చార్జ్ చేశారు.

రిక‌వ‌రీ కేసుల సంఖ్య 19లక్షల 75వేల 603కి చేరినా.. రాష్ట్ర‌వ్యాప్తంగా ఇంకా 35వేల 965 పాజిటివ్ కేసులు ఉండటంతో ప్రజలు భయంతో బతికేస్తున్నారు. క‌నీసం ల‌క్షా 75 వేల మంది హోమ్ క్వారెంటైన్‌లో ఉన్నారు. మ‌రో 1747 మంది ఇన్స్‌టిట్యూష‌న‌ల్ క్వారెంటైన్‌లో ఉన్న‌ట్లు రాష్ట్ర ఆరోగ్య‌శాఖ వెల్లడించింది.

మ‌హారాష్ట్ర‌లో కోవిడ్ రిక‌వ‌రీ రేటు 95.7 శాతంగా ఉండగా… మ‌ర‌ణాల రేటు 2.5 శాతంగా రికార్డు అయింది. ఆదివారం ఒక్క రోజే 48వేల 782 మందికి కరోనా ప‌రీక్ష‌లు చేప‌ట్టారు. వచ్చిన ఫలితాల్లో ముంబై న‌గ‌రంలో 645 పాజిటివ్ కేసులు న‌మోదు అయినట్లు అధికారులు వెల్లడించారు. నాసిక్‌లో కొత్త‌గా 122 కేసులు, పూణెలో 353, చించ్‌వాడలో 138 కేసులు న‌మోదు అయ్యాయి.

ఔరంగ‌బాద్‌, హింగోలీలో మాత్రం ఇంకా కొత్త కేసులు న‌మోదుకాలేదు. కొల్హాపూర్‌లోని ర‌త్న‌గిరి డివిజ‌న్‌లో ఒక‌రు మ‌ర‌ణించారు. మహారాష్ట్రలోని అమ‌రావ‌తి న‌గ‌రంలో 430 కొత్త కేసులు న‌మోదు అయ్యాయి.