అమెరికాలో కాల్పులు..ఆరుగురు మృతి
shooting rampage N అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. ఓక్లహోమాలో రాష్ట్రంలోని మస్కోగీలోని ఓ ఇంట్లో ఆగంతకుడు జరిపిన కాల్పుల్లో ఆరుగురు మరణించారు. వీరిలో ఐదుగురు చిన్నారులు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడ్డ ఓ మహిళను ఆస్పత్రికి తరలించారు.
మస్కోగిలో కాల్పులు జరుగుతున్నట్లు రాత్రి 1.30 గంటల ప్రాంతంలో పోలీసులకు ఫోన్ వచ్చింది. పోలీసులు వచ్చేసరికి తుపాకితో ఉన్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఘటనాస్థలిలో నలుగురు చిన్నారులు సహా ఓ వ్యక్తి మృతదేహాన్నిపోలీసులు గుర్తించారు. మరో చిన్నారి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. అయితే దుండగుడి వివరాలను పోలీసులు ఇంకా ప్రకటించలేదు.
కాగా, విస్కాన్సిన్లోని ఓ మాల్లో ఆదివారం దుండగుడు జరిపిన కాల్పుల్లో ఒకరు మృతి చెందగా, మరొకరు గాయపడిన విషయం తెలిసిందే. గ్రాండ్ చ్యూట్లోని ఫాక్స్ రివర్ మాల్లో ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటల(అమెరికా కాలమానం ప్రకారం) ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు అక్కడి పోలీసులు వెల్లడించారు. కాగా, విస్కాన్సిన్లో ఇటీవల జరిగిన రెండో మాల్ ఘటన ఇది. నవంబర్లో సబర్బన్ మిల్వాకీలోని వావుటోసాలోని ఓ మాల్లో దుండగుడు కాల్పులకు తెగబడడంతో ఎనిమిది గాయపడిన విషయం తెలిసిందే.