Ukraine Russia War : భారత్కు వార్నింగ్ ఇచ్చిన రష్యా
యుక్రెయిన్ పై యుధ్ధం మొదలెట్టినప్పటి నుంచి రష్యాకు ప్రపంచ వ్యాప్తంగా పలు ఎదురు దెబ్బలు తగులుతున్నాయి.
Ukraine Russia War : యుక్రెయిన్ పై యుధ్ధం మొదలెట్టినప్పటి నుంచి రష్యాకు ప్రపంచ వ్యాప్తంగా పలు ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ప్రపంచ మానవ హక్కుల మండలి నుంచి రష్యాను సస్పెండ్ చేస్తూ 193 మంది సభ్యులతో కూడిన ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ గురువారం తీర్మానాన్ని ఆమోదించింది.
సాధారణ అసెంబ్లీలో మొత్తం 193 సభ్యుల ఓటింగ్కు గానూ.. రష్యాను తొలగించాలంటూ 93 దేశాలు ఓట్లు వేశాయి. 24 దేశాలు వ్యతిరేకంగా ఓట్లు వేయగా.. 58 దేశాలు ఓటింగ్కు దూరంగా ఉన్నాయి. ఓటింగ్ దూరంగా ఉన్న దేశాల్లో భారత్ కుడా ఉంది. అయితే ఓటింగ్ కు ముందు రష్యా భారత్ తో మాట్లాడి తమకు మద్దతు ఇవ్వమని కోరింది. అయినా భారత్ ఆచితూచి వ్యవహరించి ఓటింగ్ కు దూరంగా ఉంది.
ఈ సందర్భంగా ఓటింగ్పై యూఎన్లో భారత శాశ్వత ప్రతినిధి టీఎస్ తిరుమూర్తి స్పందిస్తూ.. ఉక్రెయిన్ వివాదం ప్రారంభమైన నాటి నుంచి భారతదేశం శాంతి, చర్చలు, దౌత్యం కోసం నిలబడింది. రక్తం చిందించడం, అమాయకుల ప్రాణాలను తీసుకోవడం కారణంగా ఎలాంటి పరిష్కారం ఉండదని మేము నమ్ముతున్నాము. ఇండియా ఎప్పుడూ శాంతి పక్షమే ఉంటుంది. హింసను కోరుకోదని పేర్కోన్నారు.
దీంతో రష్యా స్పందిస్తూ.. ఓటింగ్లో దూరంగా ఉన్న దేశాలకు వార్నింగ్ ఇచ్చింది. ఓటింగ్కు దూరంగా ఉండటం అంటే తమతో శత్రుత్వాన్ని పెంచుకోవడమేనని పేర్కొంది. ఇది భవిష్యత్తులో దేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందాలపై ప్రభావం చూపుతుందని హెచ్చరించింది.
Also Read : Russia Bomb Attack : యుక్రెయిన్ పై రష్యా మళ్లీ బాంబుల వర్షం.. 30 మంది మృతి
రష్యాకు చైనా అనుకూలంగా ఓటు వేయగా.. భారత్ తో సహా బంగ్లాదేశ్, భూటాన్, బ్రెజిల్, ఈజిప్టు, ఇండోనేషియా, ఇరాక్, మలేషియా, మాల్దీవులు, నేపాల్, పాకిస్తాన్, ఖతార్, సౌదీ అరేబియా, సింగపూర్, సౌతాఫ్రికా, శ్రీలంక, యూఏఈ.. దూరంగా ఉన్నాయి.