Shanghai : ఆకలితో అలమటిస్తున్న చైనా ప్రజలు..10 రోజులుగా కఠిన లాక్ డౌన్
కరోనా పుట్టినిల్లైన చైనా మరోసారి ఆ వైరస్తో అల్లకల్లోలం అవుతోంది. కోవిడ్ కట్టడికి కఠిన చర్యలు చేపడుతుండడంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు...

Strict lockdown in China
Shanghai Food Shortage : ఆకలి మహాప్రభో అంటున్నారు చైనా ప్రజలు. గత కొన్ని రోజులుగా కొన్ని ప్రాంతాల్లో కఠినంగా లాక్ డౌన్ అమలు చేస్తుండడంతో ప్రజలు తీవ్రంగా అల్లాడిపోతున్నారు. ప్రధానంగా షాంఘై అల్లాడిపోతోంది. వేలకు వేలుగా పాజిటివ్ కేసులు నమోదవుతుండడంతో కఠిన చర్యలు చేపడుతున్నారు. కానీ.. ఈ చర్యలు ప్రజలను ఇబ్బందుల్లో పడేస్తున్నాయి. ఇంట్లో కనీసం తినడానికి ఆహారం, తాగడానికి మంచినీళ్లు, అనారోగ్యానికి గురైన వారికి మందులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Read More : China Daily Covid Cases : చైనా, యుకేలో కరోనా కల్లోలం.. రికార్డు స్థాయిలో రోజువారీ కేసులు..!
కరోనా పుట్టినిల్లైన చైనా మరోసారి ఆ వైరస్తో అల్లకల్లోలం అవుతోంది. కోవిడ్ కట్టడికి కఠిన చర్యలు చేపడుతుండడంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో భవనాల్లోని బాల్కనీలు, కిటికీల నుంచి అరుపులు, కేకలు, పాటలతో తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆకలితో అలమటిస్తున్నా ప్రభుత్వం మాత్రం కఠినంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం చేస్తున్నారు. వీటితోపాటు పలుచోట్ల సూపర్ మార్కెట్ల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చైనాలో ముఖ్యంగా షాంఘై కోవిడ్కు కేంద్రబిందువుగా మారింది. ప్రతీరోజు అక్కడ 20వేలకు పైగా పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి. 2022, ఏప్రిల్ 10వ తేదీ ఆదివారం ఒక్కరోజే 25 వేల కేసులు రికార్డయ్యాయి. మార్చిలో కరోనా తీవ్రత పెరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు లక్షా 70వేల కేసులు బయటపడ్డాయి.
వైరస్ కట్టడిలో భాగంగా ఏప్రిల్ 1 నుంచి షాంఘై మహా నగరంలో లాక్డౌన్ విధించారు. ముందుగా ఐదు రోజులేనన్న అధికారులు.. వైరస్ ఉద్ధృతి తగ్గకపోవడంతో పది రోజులైనా కఠిన లాక్డౌన్ అమలు చేస్తున్నారు . దీంతో ప్రజల్లో అసహనం పెరిగిపోతోంది. ఓవైపు ఇళ్లకే పరిమితం కావడం, మరోవైపు నిత్యావసరాల కొరతతో షాంఘై వాసులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వృద్ధులకు ఔషధాలు పొందడం కూడా ఇబ్బందిగా మారింది. ఇలా కనీసం తిండి కూడా దొరకడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భవనాల కిటికీలు, బాల్కనీల్లోకి వచ్చి పెద్దగా అరుస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు.