Taliban : మహిళా ప్రభుత్వ ఉద్యోగులు ఇంట్లోనే ఉండాలి
అఫ్ఘానిస్తాన్ లో భద్రతా పరిస్థితులు మెరుగుపడే వరకు ప్రభుత్వ ఉద్యోగాలు చేసే మహిళలు ఇళ్ళకే పరిమితమవ్వాలని తాలిబన్ ప్రకటించింది.
Taliban అఫ్ఘానిస్తాన్ లో భద్రతా పరిస్థితులు మెరుగుపడే వరకు ప్రభుత్వ ఉద్యోగాలు చేసే మహిళలు ఇళ్ళకే పరిమితమవ్వాలని తాలిబన్ ప్రకటించింది. మంగళవారం రాజధాని కాబూల్ లో తాలిబన్ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ..సెక్యూరిటీ సిబ్బంది అనుమతించే వరకు మహిళా ప్రభుత్వ ఉద్యోగులు ఇంట్లోనే ఉండాలని పేర్కొంది.
ఇక, అఫ్ఘాన్ల తరలింపు గడువును పొడిగించేందుకు తాము అంగీకరించబోమని జబీహుల్లా తెలిపారు. నైపుణ్యంగల అఫ్ఘాన్ల తరలింపును అమెరికా ఆపాలన్నారు. ఆగస్ట్ 31 నాటికి అమెరికా బలగాల ఉపసంహరణ పూర్తి కావాల్సిందేనని మరోసారి సృష్టం చేశారు. ఇంటింటి తనిఖీలు జరుగడం లేదన్నారు. తాలిబన్ ప్రతినిధితో సీఐఏ భేటీ గురించి తనకు తెలియదన్నారు.
ఆఫ్ఘన్ జాతీయులు కాబూల్ ఎయిర్పోర్టుకు వెళ్లవద్దని ఆయన సూచించారు. ప్రస్తుతం విదేశీయులు మాత్రమే ఎయిర్పోర్టుకు వెళ్లేందుకు అనుమతిస్తున్నట్లు జబిహుల్లా తెలిపారు. అఫ్ఘాన్లో జనజీవనం సాధారణ స్థితికి వచ్చినా, ఎయిర్పోర్టు వద్ద గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో అఫ్ఘన్ జాతీయులు ఎట్టిపరిస్థితుల్లో ఎయిర్పోర్ట్కు వెళ్లవద్దని సూచించారు. కాబూల్ లో ఇంటింటి తనిఖీలు జరుగడం లేదన్నారు.పంజ్షీర్లోని సమస్యను శాంతియుతంగా పరిష్కరించడానికి కట్టుబడి ఉన్నట్లు జబిహుల్లా చెప్పారు. ఇక,కాబూల్ లో తాలిబన్ లీడర్ బరాదర్ తో అమెరికా నిఘా సంస్థ సీఐఏ చీఫ్ భేటీ గురించి తమకు తెలియదన్నారు.
మరోవైపు, కాబూల్ నుంచి వేలాది మందిని తరలించే కార్యకలాపాలను అమెరికా నేతృత్వంలోని నాటో దళాలు పెంచాయి. ఆగస్టు 31 గడువుకు కట్టుబడి ఉంటామని జో బైడెన్ ప్రకటించడంతో, ఈ గడువును పొడిగించేలా తాలిబన్లతో చర్చలు జరపాలని ఆయనపై ఒత్తిళ్ళు పెరుగుతున్నాయి.
ఇక,అమెరికా ప్రభుత్వ లెక్కల ప్రకారం..తాలాబన్లు కాబూల్ లోకి ప్రవేశించిన ఆగస్టు-15 నుంచి ఇప్పటివరకు ఈ తొమ్మిది రోజుల్లో దాదాపు 50వేల మంది అప్గాన్లు,విదేశీయులు కాబూల్ ఎయిర్ పోర్ట్ నుంచి దేశం వదిలి వెళ్లారు.