MLA Surendra Singh : మమత లంకిణి-మోదీ రాముడు..బీజేపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
ఉత్తరప్రదేశ్ లోని బలియా నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
MLA Surendra Singh ఉత్తరప్రదేశ్ లోని బలియా నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి, వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీని..రామాయణంలోని లంకిణి పాత్రతో, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ను ఔరంగజేబుతో పోల్చారు సురేంద్ర సింగ్. ప్రధాని మోదీని రాముడిగా,యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ని లక్షణుడితో పోల్చారు.
బెంగాల్లో ఎన్నికల అనంతరం చెలరేగిన అల్లర్లలో వందలాది మంది చనిపోయారని సురేంద్ర సింగ్ దీదీపై విరుచుకుపడ్డారు. గురువారం(జులై-29,2021)ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ మీడియాతో మాట్లాడుతూ..ఓట్ల కోసం మమత చాలా మంది చంపారని,మమత తన కంటికి లంకిణిలా కనబడుతుందని చెప్పారు. అయితే లంకిణిని నాశనం చేసేవారు పుట్టాడన్నారు. నరేంద్రమోదీ రాముడైతే..యోగి ఆదిత్యనాథ్ హనుమాన్ అని తెలిపారు. వ్యాపారవేత్తలకు,కార్మికులకు,యువతకు,పేదలకు గౌరవమిచ్చేందుకు రామ-హనుమాన్ జోడి పుట్టిందన్నారు. రాజకీయ లంకిణి మమత ఆటలు సాగవన్నారు. కొంతమంది విదేశీ ముస్లింలు వచ్చి ఇక్కడ స్థిరపడ్డారని,వారి ఓట్లు మరియు అరాచకం వల్లనే మమత విజయం సాధించిందని తెలిపారు. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీ కాకుండా రాజకీయ ఆర్మీ ఏర్పాటు కావాల్సి ఉన్నట్లు కన్పిస్తోందన్నారు.
ఇక తన తండ్రి ములాయం సింగ్ యాదవ్ను, బాబాయి శివపాల్ యాదవ్ను పార్టీ పదవుల నుంచి తప్పించి సమాజ్వాదీ పార్టీని తన గుప్పిట్లోకి తీసుకున్నారని అఖిలేష్ యాదవ్పై సురేంద్ర సింగ్ విమర్శలు గుప్పించారు. అఖిలేష్ యాదవ్..మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు అడుగుజాడల్లో నడుస్తున్నారని మండిపడ్డారు. ఔరంగజేబు తన తండ్రి షాజహాన్ను పదవి నుంచి తొలగించిన అనంతరం ఆయనను ఆగ్రా జైలులో పెట్టించాడని బీజేపీ ఎమ్మెల్యే గుర్తు చేశారు. అఖిలేష్ యాదవ్ ఇప్పుడు బ్రాహ్మణుల గురించి మాట్లాడుతున్నాడని..2003లో అఖిలేష్ యాదవ్ కి ఓటు వేసిన యాదవులు మౌ టౌన్ లో చంపబడ్డారని..కులాన్ని అధికారం కోసం మాత్రమే వాడుకుంటున్నారని అఖిలేష్ యాదవ్ పై సురేంద్ర సింగ్ మండిపడ్డారు. కష్టసమయంలో తన సొంత యాదవ కమ్యూనిటీ కోసం నిలబడని అఖిలేష్ యాదవ్..సమాజానికి ఏం మేలే చేస్తారని ఎమ్మెల్యే ప్రశ్నించారు.
కాగా, కోవిడ్ వ్యాప్తి సమయంలో..తాను కరోనా సోకకుండా ఉండేందుకు రోజూ గో మూత్రం తాగుతున్నానని,ప్రజలందరూ కూడా ప్రతి రోజూ గోమూత్రం తాగాలని ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా దుమారం రేపిన విషయం తెలిసిందే.