రాముడి దేశంలో.. సీతమ్మ నేలలో.. రావణుని లంకలో.. పెట్రోల్ ధరలపై బీజేపీ ఎంపీ సెటైర్!
భారత్లో మిగిలిన దేశాలతో పోలిస్తే.. పెట్రోల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. మిగిలిన దేశాల్లో పెట్రోల్ ధరలు చాలా తక్కువగా ఉండగా.. మనదేశంలో మాత్రం వందకు చేరువలో ఉన్నాయి. ఈ క్రమంలో కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ పెట్రోల్ ధరలపై వ్యంగ్యాస్త్రాలు సంధించింది. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తుండగా.. కొన్ని చోట్ల పెట్రోల్ ధరలు సెంచరీ కూడా కొట్టేసింది.
ఈ క్రమంలో లేటెస్ట్గా బడ్జెట్లో కేంద్రం పెట్రోల్, డీజిల్ మీద వ్యవసాయ సెస్ విధిస్తూ నిర్ణయం తీసుకుంది. దీనిపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుండగా.. సొంత పార్టీ నుంచి కూడా కొందరు వ్యతిరేకిస్తున్నారు. అయితే ఈ సెస్ను సుంకం నుంచి మినహాయిస్తామని ప్రజలపై ఈ భారం మోపమని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి కూడా దేశంలో పెట్రోల్, డీజిల్ రేట్లకు సంబంధించి ఓ వ్యంగ్య ఫోటోని ట్విట్టర్లో షేర్ చేశారు. ఇందులో ‘‘రామ జన్మభూమిగా భావించే ఇండియాలో లీటర్ పెట్రోల్ ధర 93 రూపాయలు.. సీతమ్మవారు పుట్టిన దేశం నేపాల్లో లీటర్ పెట్రోల్ ధర 53 రూపాయలు.. రావణుడి లంకలో పెట్రోల్ లీటర్ 51 రూపాయలు మాత్రమే’’ అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. దేశంలో పెట్రోల్ రేట్లు పెరిగిన తర్వాత ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
— Subramanian Swamy (@Swamy39) February 2, 2021