కల్నల్ సంతోష్ అంత్యక్రియల్లో భౌతిక దూరం..కోవిడ్ నిబంధనలు
దేశం కోసం ప్రాణాలర్పించిన ధీరుడు..భారత్ – చైనా సరిహద్దులో జరిగిన ఘర్షణలో వీరమరణం పొందిన తెలంగాణ బిడ్డ సంతోష్ సరిహద్దులో దేశం కోసం ప్రాణాలు వదిలాడు. ఇతడిని చూసేందుకు…అంతిమ నివాళులు అర్పించాలని చాలా మంది అనుకున్నారు. అమర్ రహే..సంతోష్ నినాదాలతో మారుమ్రోగుతున్నాయి.
ఆ వీరుడిని చూసేందుకు..కడసారి వీడ్కోలు పలికేందుకు అనుకున్న వారికి కరోనా నిబంధనలు అడ్డు తగులుతున్నాయి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ విస్తరిస్తోంది. ఈ క్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని నిబంధనలు పాటించాలని చెబుతున్నాయి. దీంతో కల్నల్ అంత్యక్రియల్లో కొద్ది మందికి మాత్రమే అవకాశం కల్పించనున్నారు.
సంతోష్ బాబు వ్యవసాయక్షేత్రంలో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. నివాసం నుంచి..అంతిమయాత్ర జరుగనుంది. ఇప్పటికే ఆర్మీ ఉన్నతాధికారులు సూర్యాపేటకు చేరుకున్నారు. ప్రోటోకాల్ నిబంధనలు ఉంటాయని చెబుతున్నారు. ఈ నిబంధనల ప్రకారమే అంతిమక్రియలు జరుగనున్నాయని స్పష్టం చేస్తున్నారు. ఆర్మీ అధికారుల సూచనల మేరకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు.
అంతిమయాత్రకంటే ముందు..ఆర్మీ డ్రిల్ ఉండనుంది. ఆ తర్వాతే..అంతిమయాత్ర ప్రారంభం కానుంది. మొత్తంగా వ్యవసాయక్షేత్రంలో ఉదయం 10.30 గంటలకు కల్నల్ సంతోష్ కడసారి వీడ్కోలు పలుకనున్నారు. అంతిమయాత్ర ఏర్పాట్లను..కలెక్టర్, ఎస్పీ పరిశీలించారు. కేవలం 100 మంందికి మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు..అందులో 50 మంది ఆర్మీ అధికారులు ఉండనున్నారు.
మిగతా సంతోష్ కుటుంబసభ్యులు, వీవీఐపీలు, వీఐపీలు, ఇతర ప్రజాప్రతినిధులు మాత్రమే ఉండనునున్నారు. అంతిమయాత్రకు వీరంతా ముందుండనున్నారు. వెనుక చాలా మంది వస్తారని భావించిన అధికారులు అందుకనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. కంపల్సరీ భౌతిక దూరం, కోవిడ్ నిబంధనలు పాటించాలని అధికారులు చెబుతున్నారు. పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
2020, జూన్ 17వ తేదీ బుధవారం సాయంత్రం హకీంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్న సంతోష్ పార్థీవ దేహం..నేరుగా సూర్యాపేటకు చేరుకుంది. కొడుకు భౌతికకాయాన్ని చూసి కన్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. కొద్ది రోజుల్లో ఇంటికి వస్తాడని అనుకున్న ఆ తల్లిదండ్రులకు తీరని శోకం మిగిలింది. కానీ వస్తున్న దుఃఖాన్ని..దిగమింగుకుని…దేశం కోసం ప్రాణాలర్పించడం గొప్ప అవకాశమని తల్లిదండ్రులు చెప్పడం అందరికీ స్పూర్తినిచ్చింది.
లద్దాఖ్లోని గాల్వన్ లోయ వద్ద సరిహద్దుల్లో భారత్, చైనా బలగాల మధ్య జరిగిన ఘర్షణలో భారత సైన్యానికి చెందిన 20 మంది వీరమరణం పొందారు. అందులో కల్నల్ సంతోష్ కూడా ఉన్నారు. 2020, జూన్ 17వ తేదీ బుధవారం సంతోషబాబు భౌతిక కాయాన్ని
ఆర్మీ అధికారులు హకీంపేటకు తీసుకొచ్చారు కల్నల్ సంతోష్ బాబు పార్థివదేహానికి తెలంగాణ గవర్నర్ తమిళసై, హోం మంత్రి మహమ్మద్ అలీ, మంత్రి కేటీఆర్, డీజీపీ మహేందర్ రెడ్డి సహ స్థానిక మంత్రులు, అధికారులు నివాళలర్పించారు. సంతోష్ బాబుకు ఆర్మీ అధికారులు సైనిక వందనం సమర్పించారు. మూడు నెలల క్రితమే సంతోష్ హైదరాబాద్కు బదిలీ అయ్యారు. కానీ లాక్డౌన్ కారణంగా ఆయన చైనా సరిహద్దులోనే ఉండిపోయారు. ఆయనకు భార్య సంతోషి, కుమార్తె అభిజ్ఞ(9), కుమారుడు అనిరుధ్(4) ఉన్నారు.
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని విద్యానగర్కు బిక్కుమళ్ల ఉపేందర్, మంజుల దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి కుమారుడు సంతోష్, కుమార్తె శృతి ఉన్నారు. 1983 ఫిబ్రవరిలో జన్మించిన సంతోష్ జన్మించారు. ఉపేందర్ ఎస్బీఐ బ్యాంకులో వివిధ హోదాల్లో పనిచేశారు. చీఫ్ మేనేజర్గా రిటైరయ్యారు. కానీ..సైన్యంలో చేరి భారతదేశానికి సేవ చేయాలనే తపన ఉపేందర్ కు ఉండేది. కానీ అది నెరవేరలేదు.
తన కొడుకు రూపంలో చాడాలని అనుకున్నారు. తండ్రి కలను నెరవేర్చేందుకు సంతోష్ చిన్ననాటి నుంచే విపరీతంగా శ్రమించాడు. 1 నుంచి 5వ తరగతి వరకు స్థానిక సంధ్య హైస్కూల్లో చదివారు. 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఏపీలోని విజయనగరంలో ఉన్న కోరుకొండ సైనిక్ స్కూల్ విద్యనభ్యసించారు. తర్వాత..పూణేకు మకాం మార్చారు. అక్కడున్న నేషనల్ డిఫెన్స్ అకాడమీలో డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత డెహ్రాడూన్లో సైనిక శిక్షణ చేపట్టారు. 2004 డిసెంబర్లో లెఫ్ట్నెంట్గా బిహార్ రెజిమెంట్ 16వ బెటాలియన్లో విధుల్లో చేరారు సంతోష్.
ఎన్నో కష్టాలు పడి..శ్రమించి..తన తండ్రి కలను నెరవేర్చారు. దీంతో ఆ తండ్రి ఎంతో సంతోషించారు. ఎన్నో గోల్డ్ మెడల్స్ను సొంతం చేసుకున్నారు సంతోష్. తన 15 ఏళ్ల సర్వీసులో నాలుగు పదోన్నతులు పొందడం విశేషం. 2007లో ముగ్గురు చొరబాటుదారులను అంతమొందించారు. ఢిల్లీ, కశ్మీర్, అరుణాచల్ప్రదేశ్, మేఘాలయా, లడక్, పాకిస్తాన్తోగల సరిహద్దులో కూడా పనిచేశారు. కొంతకాలం ఆఫ్రికా దేశం కాంగోలోనూ విధులు నిర్వహించారు సంతోష్. ప్రస్తుతం జమ్మూకశ్మీర్లోని లడక్లో (కల్నల్) కమాండర్గా విధులు నిర్వహిస్తున్నారు.
భారతదేశంలో కరోనా వైరస్ విజృంభిస్తుండడంతో సంతోష్…లడక్లోనే విధులు నిర్వహించాల్సి వచ్చిందని కుటుంబ సభ్యులు తెలిపారు. చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో సంతోష్ వీరమరణం పొందడంతో తల్లిదండ్రులు కలత చెందారు. ఈ విషాద వార్త..మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు సైనికాధికారులు ఫోన్ ద్వారా తెలిపారు.