Ganesh Immersion : భాగ్యనగరంలో నిమజ్జన కోలాహలం..ట్యాంక్బండ్కు గణనాథుల క్యూ
ట్విన్ సిటీస్లో శోభాయాత్ర అంగరంగ వైభవంగా సాగుతోంది. గంగమ్మ ఒడికి చేరడానికి వచ్చిన వినాయకులు.. వాటిని చూడటానికి వచ్చిన జనంతో ట్యాంక్ బండ్ జనసంద్రంగా మారింది.
Ganesh immersion in Hyderabad : పాతబస్తీ సందుల్లో నుంచి సికింద్రాబాద్ జంక్షన్ వరకు.. అది గల్లీ అయినా మెయిన్ రోడ్ అయినా.. కనిపించే దృశ్యం గణనాథుడి శోభాయాత్ర… వినిపించే నినాదం గణపతి బొప్ప మోరియా.. తరలివస్తున్న వినాయకులతో హుస్సేన్ సాగర్ తీరం గణనాథుల హారంగా మారింది. గంగమ్మ ఒడికి చేరడానికి వచ్చిన వినాయకులు.. వాటిని చూడటానికి వచ్చిన జనంతో ట్యాంక్ బండ్ జనసంద్రంగా మారింది.. బ్యాండ్, డీజే హోరులో కొందరు.. భజనలు చేస్తూ మరికొందరు.. తొమ్మిది రోజుల పాటు మండపాల్లో పూజలందుకున్న గణనాథులకు ఇక వెళ్లిరా అంటూ విడ్కోలు పలుకుతున్నారు.. ప్రస్తుతం ట్యాంక్ బండ్ పరిసరాలన్ని గణేశ్ మహారాజ్కి జై అన్న నినాదాలతో మారు మోగిపోతున్నాయి.
ట్విన్ సిటీస్లో శోభాయాత్ర అంగరంగ వైభవంగా సాగుతోంది.. అబిడ్స్, సుల్తాన్ బజార్, కోఠి, చోటా బజార్, జియాగూడ, సికింద్రాబాద్, రామంతాపూర్, అంబర్ పేట్.. ఇలా అనేక ప్రాంతాల నుంచి సాగర్కు విగ్రహాలు తరలివస్తున్నాయి.. ఈ ఏడాది వెళ్లి మళ్లీ వచ్చే ఏడాది రావయ్య అంటూ నిమజ్జనం నిర్విఘ్నంగా కొనసాగుతోంది.. రంగురంగుల పూలలో అలంకరించిన వాహనాలు, వాటిపై భారీ గణనాథులు కొన్ని.. వెరైటీ గణనాథులు మరికొన్ని.. ఇలా ఇప్పుడు నగరమంతా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.
Khairatabad Ganesh : ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్ర ప్రారంభం
పాతబస్తీ నుండి ట్యాంక్ బ్యాండ్ కు వెయ్యి వినాయక విగ్రహాలు బయలు దేరనున్నాయి. అడుగడుగున పోలీస్ పహారా కాస్తున్నారు. లా అండ్ ఆర్డర్, రిజర్వ్ అండ్ టాస్క్ ఫోర్స్, క్రైమ్, మఫ్టీ, షీ టీమ్స్, రాపిడ్ యాక్షన్, ఆక్టోపస్, షాడో టీమ్స్, గ్రే హౌండ్స్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ పోలీస్ బలగాలతో పహారా కాస్తున్నారు. పాతబస్తీ లో 1.75 వేల సీసీ కెమెరాల ద్వారా నిఘా ఉంచారు. బషీర్ బాగ్ సీపీ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ ద్వారా పర్యవేక్షణ చేయనున్నారు.
ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర ప్రారంభమైంది.. వడివడిగా గణనాథుడి అడుగులు గంగమ్మ ఒడివైపు పడుతున్నాయి.. ఇక వచ్చే ఏడాది 18 తలలతో కూడిన 70 అడుగుల మట్టి మహాగణపతిని ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు.
Ganesh Idols : పాతబస్తీ నుండి ట్యాంక్ బండ్ కు వెయ్యి వినాయక విగ్రహాలు
ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్ర 2.5 కిలోమీటర్ల పొడవునా సాగనుంది. దీంతో పోలీసులు ఈ రూట్మ్యాప్పై ప్రత్యేక దృష్టి సారించారు. మధ్యాహ్నం 2 గంటలకల్లా ఖైరతాబాద్ గణపతి నిమజ్జనం పూర్తి చేయనున్నారు. ఎప్పటిలానే రూట్ మ్యాప్ ప్రకారం.. ద్వారకా హోటల్, టెలీఫోన్ భవన్, ఇక్బాల్ మినార్, ఓల్డ్ సెక్రటేరియట్ గేట్, తెలుగుతల్లి ఫ్లైఓవర్, లుంబినీ పార్క్ మీదుగా ఖైరతాబాద్ గణేశుని శోభాయాత్ర జరగనుంది.
క్రేన్ నెంబర్ 6 దగ్గర హుస్సేన్సాగర్లో గణనాథుడి నిమజ్జనం జరగనుంది. ఉదయం 9 గంటలకు పంచముఖ రుద్ర మహాగణపతికి ఉత్సవ కమిటీ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం లంబోదరుడు నిమజ్జనానికి తరలించారు. విజయవాడ నుంచి తీసుకొచ్చిన భారీ క్రేన్ ద్వారా గణేశుడిని తరలిస్తున్నారు.