Hyderabad Metro: గుడ్ న్యూస్.. హైదరాబాద్ మెట్రో రైల్ కోచ్లు పెరిగే అవకాశం.. అంతేకాదు..
ఇప్పటికే మెట్రో రైళ్లలో ప్రతిరోజు ప్రయాణించే వారి సంఖ్య 5 లక్షలకు చేరింది. మరిన్ని సౌకర్యాలు..
Hyderabad Metro Rail: ఆఫీసు వేళల్లో రద్దీగా ఉంటున్న హైదరాబాద్ (Hyderabad) మెట్రో రైళ్లలో.. ఎన్నో ఇబ్బందులు పడుతూ ప్రయాణిస్తున్న వారికి గుడ్ న్యూస్. మెట్రో రైల్ కోచ్లను పెంచడంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ (KTR) సంబంధిత అధికారులతో హైదరాబాద్ లోని రసూల్ పురా (Rasoolpura) మెట్రో భవన్లో చర్చలు జరిపారు.
అంతేకాదు, పాదచారుల కోసం అనువైన ఫుట్పాత్లను నిర్మిస్తే బాగుంటుందని యోచిస్తున్నారు. ఇప్పటికే మెట్రో రైళ్లలో ప్రతిరోజు ప్రయాణించే వారి సంఖ్య 5 లక్షలకు చేరింది. మరిన్ని సౌకర్యాలు కల్పిస్తే కొన్ని రోజుల్లోనే ఆ సంఖ్య మరింత పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు.
శంషాబాద్ ఎయిర్పోర్టు వరకు మెట్రో రైల్ సేవలను విస్తరించే అవంశంపై కూడా అధికారులతో కేటీఆర్ చర్చించారు. గుర్తించిన ప్రభుత్వ స్థలాలను మెట్రోకు ఇవ్వాలన్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ వద్ద నిర్మించే మెట్రో డిపో కోసం 48 ఎకరాల స్థలాన్ని ఇవ్వాలని జీఎంఆర్ కి మంత్రి ఆదేశించారు.
బీహెచ్ఈఎల్ – లక్డీకాపూల్, నాగోల్ – ఎల్బీనగర్ వరకు నిర్మించే 36 కిలోమీటర్ల మెట్రో రైల్ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం నుంచి 9,100 కోట్ల రూపాయల సాయం అందే విధంగా కృషి చేయాలని సీఎస్ ను ఆదేశించారు. క్యాబినెట్లో నిర్ణయించిన మెట్రో కారిడార్లలో వెంటనే సర్వే జరిపి పూర్తి స్థాయి ప్రాజెక్ట్ రిపోర్ట్ అందించాలన్నారు.
దానిని త్వరలోనే కేంద్ర ప్రభుత్వానికి అనుమతి కోసం పంపిస్తామని తెలిపారు. అలాగే, మెట్రో కారిడార్లలో మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ కోసం ప్రభుత్వ స్థలాలను గుర్తించాలని అన్నారు. ఈ మేరకు మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లా కలెక్టర్లకు మంత్రి ఆదేశాలు ఇచ్చారు. ఓల్డ్ సిటీ మెట్రోలో భూ సేకరణ త్వరగా పూర్తి చేయాలని అన్నారు.