Revanth Reddy : జగ్గారెడ్డి ఫైర్.. రేవంత్ రెడ్డి సైలెంట్
ఒక్కడి ఇమేజ్ కోసం మిగతా వారిని తొక్కే ప్రయత్నం జరుగుతోందని.. కాంగ్రెస్ లో సింగిల్ హీరో కుదరదని చెప్పారు జగ్గారెడ్డి.
Revanth Reddy : తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల్లో అనుసరించే వ్యూహాలపై ఈ ఉదయం సీఎల్పీ భేటీ అయింది. పీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై… సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆగ్రహంతో ఈ సమావేశం హాట్ హాట్ గా సాగింది.
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అధ్యక్షతన సీఎల్పీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎంపీ ఉత్తమ్కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి, శ్రీధర్బాబు, సీతక్కలు అటెండయ్యారు. అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ అనుసరించాల్సిన వ్యూహ, ప్రతివ్యూహాలపై చర్చించారు. రాష్ట్రంలో ప్రధాన ప్రజా సమస్యలపై ప్రభుత్వంతో గట్టిగా పోరాడాలని నిర్ణయించారు. ప్రజా సమస్యలపై చర్చించాల్సి ఉన్నందున ఎక్కువ రోజులు అసెంబ్లీ సమావేశాలు జరపాలని బీఏసీ సమావేశంలో డిమాండ్ చేయాలని నిర్ణయించారు. ప్రజా సమస్యలపై చర్చించేందుకు కాంగ్రెస్ పార్టీకి తగినంత సమయం ఇవ్వాలని బీఏసీలో కోరాలని డిసైడయ్యారు. దళిత బంధు, ఆర్టీసీ, విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదన, పోడుభూములు, ధరణి పోర్టల్ సమస్య తదితర వాటిపై చర్చకు పట్టుబట్టాలని నిర్ణయించారు.
జగ్గారెడ్డి Vs రేవంత్ రెడ్డి
సీఎల్పీ అంతర్గత సమావేశం వాడీవేడిగా జరిగింది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యవహార శైలిపై పార్టీ ముఖ్య నేతల దగ్గర తన అసంతృప్తిని, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి. పార్టీ వర్గాలు చెప్పిన సమాచారం ప్రకారం…. జహీరాబాద్ లో క్రికెట్ మ్యాచ్ కోసం వస్తున్నట్లు… తనకు కనీసం పీసీసీ నుంచి సమాచారం రాలేదన్నారు. వ్యక్తిగత ప్రచారం కోసం ఆరాటపడితే కాంగ్రెస్ పార్టీలో కుదరదనీ… జహీరాబాద్ కు వస్తే కనీసం సీనియర్ నేత గీతారెడ్డికి సమాచారం ఇవ్వలేదన్నారు. సంగారెడ్డికి వస్తే… తనకు సమాచారం ఇవ్వడం లేదన్నారు. తనకు…రేవంత్ కి మధ్య విభేదాలు ఉన్నాయని చెప్పేందుకే రేవంత్ రెడ్డి.. ఇలా సమాచారం ఇవ్వడం లేదా అని పార్టీ ముఖ్యనేతలతో జగ్గారెడ్డి అన్నారు. ఇది పార్టీనా.. లేక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీనా అని ఫైరయ్యారు జగ్గారెడ్డి.
Telangana : అసెంబ్లీ, మండలి సమావేశాలు ప్రారంభం.. సోమవారానికి వాయిదా
పార్టీ కమిటీలలో డిస్కషన్ చేయకుండా ముందే ప్రోగ్రాంలు ఫిక్స్ చేస్తున్నారని ఫైరయ్యారు. కాంగ్రెస్ లో అందరూ ఒకటేనని…ఒక్కరే స్టార్ అనుకుంటే కుదరదని చెప్పారు. సంగారెడ్డి నియోజకవర్గానికి పీసీసీ వస్తే .. తనకు సమాచారం ఇవ్వరా.. ఈ ప్రోటోకాల్ కూడా తెలియదా అని ప్రశ్నించారు. ఒక్కడి ఇమేజ్ కోసం మిగతా వారిని తొక్కే ప్రయత్నం జరుగుతోందని.. కాంగ్రెస్ లో సింగిల్ హీరో కుదరదని చెప్పారు జగ్గారెడ్డి. రేవంత్ రెడ్డి పీసీసీ కాకముందే.. తాను మూడు సార్లు ఎమ్మెల్యే అయ్యానన్నారు.
ఈ హాట్ హాట్ వ్యవహారం తెలుసుకున్న రేవంత్ రెడ్డి.. ఆఖరి నిమిషంలో సీఎల్పీ భేటీకి దూరంగా ఉన్నారు. సమావేశం ముందు నుంచే ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఫైర్ అవుతున్నారని తెలిసి… రేవంత్ రెడ్డి సైలెంటైపోయారు.
Revanth Reddy: కేటీఆర్పై ఆరోపణలు చేయొద్దు.. రేవంత్ రెడ్డిని ఆదేశించిన కోర్టు