సెమిస్టర్‌ పరీక్ష 30 మార్కులకే, ఇంజినీరింగ్‌ విద్యలో సమూల మార్పులు

కరోనా ముందు వరకు ఒక లెక్క, కరోనా తర్వాత మరో లెక్క. కరోనా దెబ్బకు అన్ని తలకిందులైపోయాయి.

  • Published By: naveen ,Published On : May 30, 2020 / 01:48 AM IST
సెమిస్టర్‌ పరీక్ష 30 మార్కులకే, ఇంజినీరింగ్‌ విద్యలో సమూల మార్పులు

కరోనా ముందు వరకు ఒక లెక్క, కరోనా తర్వాత మరో లెక్క. కరోనా దెబ్బకు అన్ని తలకిందులైపోయాయి.

కరోనా ముందు వరకు ఒక లెక్క, కరోనా తర్వాత మరో లెక్క. కరోనా దెబ్బకు అన్ని తలకిందులైపోయాయి. కరోనా కట్టడి కోసం విధించిన లాక్ డౌన్ కారణంగా అన్ని వ్యవస్థలు బంద్ అయ్యాయి. ఇప్పుడిప్పుడే సడలింపులు ఇవ్వడంతో ఒక్కొక్కటి ఓపెన్ అవుతున్నాయి. ఇక కరోనా లాక్ డౌన్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉన్న వ్యవస్థల్లో విద్యా వ్యవస్థ ఒకటి. లాక్ డౌన్ కారణంగా దాదాపు 2 నెలలు పాటు విద్యా సంస్థలు మూతపడ్డాయి. పరీక్షలు నిర్వహించుకుండానే విద్యా సంస్థలను బంద్ చేయాల్సి వచ్చింది. ఇక కరోనా ఎఫెక్ట్ ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు. ఈ క్రమంలో విద్యార్థుల క్షేమం దృష్టిలో పెట్టుకుని విద్యా విధానంలో మార్పులు తీసుకొస్తున్నారు. రోజు విడిచి రోజు క్లాసులు, ఆన్ లైన్ బోధన వంటివి అమలు చేయాలని చూస్తున్నారు. మరీ ముఖ్యంగా ఇంజినీరింగ్ విద్యా విధానంలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి.

సెమిస్టర్‌ స్థానంలో సీసీఈ:
ఇంజినీరింగ్‌ విద్యా విధానంలో సమూల మార్పులకు జాతీయ సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం ఉన్న సెమిస్టర్‌ విధానం స్థానంలో నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని (కంటిన్యూస్ అండ్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్-సీసీఈ) ప్రవేశపెట్టాలని భావిస్తున్నది. ఈ విధానంలో సీసీఈకి ఏకంగా 70 శాతం వెయిటేజీ ఇచ్చి, సంవత్సరాంత పరీక్షను కేవలం 30 శాతం మార్కులకే నిర్వహించాలని యోచిస్తోంది. ఆ అంశంపై అన్ని రాష్ట్రాల అభిప్రాయాలను కోరింది. సీసీఈ విధానంలో విద్యార్థికి కాలేజీలో నెలవారీ పరీక్షలు, స్లిప్‌ టెస్టులు, అసైన్‌మెంట్లు నిర్వహించి ప్రతిభను పరీక్షిస్తారు. దీనివల్ల విద్యార్థిలో సబ్జెక్టుపై ఆసక్తి, పట్టు పెరుగుతుందని ఏఐసీటీఈ భావన. లాక్‌డౌన్‌ నేపథ్యంలో విద్యాసంవత్సరం ఆలస్యంగా ప్రారంభమైనా నిర్దేశించిన సమయానికే సిలబస్‌ పూర్తి చేయటానికి కూడా ఈ విధానం తోడ్పడుతుందని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌ తుమ్మల పాపిరెడ్డి, జేఎన్టీయూహెచ్‌ రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ గోవర్ధన్‌ తెలిపారు. 

రోజు విడిచి రోజు క్లాసులు:
కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించాలంటే భౌతికదూరం తప్పనిసరి అయిన పరిస్థితుల్లో విద్యార్థులకు రోజు విడిచి రోజు క్లాసులు నిర్వహించే అంశంపై కూడా ఏఐసీటీఈ కసరత్తు చేస్తోంది. ఈ విధానంలో ఒకరోజు కాలేజీలో బోధన ఉంటే, తర్వాతి రోజు విద్యార్థులు ఇంటి నుంచే ఆన్‌లైన్‌లో క్లాసులు వినటం, సాధన చేయటం, అసైన్‌మెంట్లు పూర్తిచేయటం వంటి పనులు చేస్తారు. ఈ మార్పులపై కూడా ఏఐసీటీఈ చైర్మన్‌ అనిల్‌ సహస్రబుద్ధే అన్ని రాష్ట్రాల అభిప్రాయాలు కోరారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాలను ఉన్నత విద్యామండలి చైర్మన్‌ పాపిరెడ్డి, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌, జేఎన్టీయూహెచ్‌ అధికారులు సిద్ధం చేస్తున్నారు. మరోవైపు వచ్చే విద్యా సంవత్సరానికి డిటెన్షన్‌ విధానాన్ని రద్దు చేయాలని భావిస్తున్న అధికారులు, జూన్‌ 20 నుంచి 30 వరకు కొనసాగే బీటెక్‌ ఫైనల్‌ ఇయర్‌ విద్యార్థులకు మాత్రం డిటెన్షన్‌ ఉంటుందని స్పష్టంచేశారు.

జూన్‌ 20 నుంచి యూజీ, పీజీ చివరి సెమిస్టర్‌ పరీక్షలు.. వ్యవధి 2 గంటలే:
మరోవైపు కరోనా నేపథ్యంలో వాయిదాపడిన అండర్(యూజీ)‌, పోస్టు గ్రాడ్యుయేషన్‌(పీజీ) పరీక్షల నిర్వహణపై స్పష్టత వచ్చింది. ఈ మేరకు తెలంగాణ ఉన్నత విద్యా మండలి శుక్రవారం(మే 29,2020) మార్గదర్శకాలు జారీ చేసింది. వాటి ప్రకారం.. జూన్‌ 20 నుంచి చివరి సెమిస్టర్‌ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించనున్నారు. మిగతా సెమిస్టర్ల పరీక్షలను కాలేజీలు ప్రారంభమయ్యాక నవంబర్‌/ డిసెంబర్‌లో నిర్వహించుకోవాలని వెల్లడించారు. అవసరమైతే వర్సిటీలు వాటిని తమ ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్స్, బోర్డు ఆఫ్‌ స్టడీస్‌లో ఆమోదం తీసుకొని అమలు చేయాలని వెల్లడించారు.

మార్గదర్శకాలివే..
* పరీక్ష సమయాన్ని 3 గంటల నుంచి 2 గంటలకు తగ్గించాలి. అందుకు అనుగుణంగా ప్రశ్న పత్రాన్ని మార్పు చేయాలి. వీటి రూపకల్పన ఆయా యూనివర్సిటీలే చేసుకోవాలి.
* బ్యాక్‌లాగ్‌లతో సహా అన్ని యూజీ, పీజీ ఫైనల్‌ సెమిస్టర్‌ పరీక్షలు జూన్‌ 20వ తేదీ నుంచి నిర్వహించుకోవాలి. మిగతా సెమిస్టర్ల పరీక్షలను కాలేజీలు తెరిచాక నవంబర్, డిసెంబర్‌లో ఒక సెమిస్టర్‌ తర్వాత మరో సెమిస్టర్‌ పరీక్షలను నిర్వహించాలి. బ్యాక్‌లాగ్‌ల సంఖ్యతో సంబంధం లేకుండా మిగతా సెమిస్టర్ల విద్యార్థులను పై సెమిస్టర్‌కు ప్రమోట్‌ చేయాలి.
* సంప్రదాయ డిగ్రీల విషయంలో ప్రతిరోజూ రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించాలి. ఒక సెషన్‌లో బీకాం విద్యార్థుల్లో సగం మందికి పరీక్షలు నిర్వహిస్తే, ఇతర కోర్సుల (బీఏ, బీఎస్సీ) సగం మందికి పరీక్షలు నిర్వహించాలి. మరొక సెషన్‌లో ఆయా కోర్సుల్లో మిగిలిన సగం మందికి పరీక్షలు నిర్వహించాలి. ఈ కోర్సుల ప్రాక్టికల్స్‌ నిర్వహణను సంబంధిత కాలేజీలకు వదిలేయాలి. ఇంటర్నల్స్, ఎక్స్‌టర్నల్స్‌ పరీక్షల నిర్వహణకు ఎగ్జామినర్లను సంబంధిత ప్రిన్సిపాళ్లే నియమించుకుంటారు. 
* ప్రాజెక్టులు, వైవా, సెమినార్స్‌ వంటికి ఆన్‌లైన్‌లోనే నిర్వహించాలి. పీహెచ్‌డీ విద్యార్థులకు సంబంధించి సెమినార్లు, వైవా విషయంలో యూజీసీ నిబంధనలను అమలు చేయాలి. ఆన్‌లైన్‌లోనే నిర్వహించాలి.

Read: TSRJC-CET దరఖాస్తు గడువు పెంపు