Agnipath: ఎల్లుండి నుంచి అన్ని సర్వీసులను పూర్తిస్థాయిలో పునరుద్ధరిస్తాం: సీపీఆర్వో రాకేశ్
అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో చెలరేగిన ఆందోళనలతో నిన్న ఒక్కసారిగా రద్దు చేసిన రైళ్లు తిరిగి అదే పాయింట్ నుంచి ప్రారంభం అయ్యేందుకు సమయం పడుతుందని రైల్వే సీపీఆర్వో రాకేశ్ చెప్పారు.
Agnipath: అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో చెలరేగిన ఆందోళనలతో నిన్న ఒక్కసారిగా రద్దు చేసిన రైళ్లు తిరిగి అదే పాయింట్ నుంచి ప్రారంభం అయ్యేందుకు సమయం పడుతుందని రైల్వే సీపీఆర్వో రాకేశ్ చెప్పారు. రైళ్ళ పునరుద్ధరణపై ఆయన 10 టీవీతో మాట్లాడుతూ.. నేడు తాత్కాలికంగా ఆయా రైళ్ళను రద్దు చేశామని అన్నారు. సోమవారం నుంచి అన్ని సర్వీసులను పూర్తిస్థాయిలో పునరుద్ధరిస్తామని చెప్పారు.
నిన్నటి ఘటన నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే స్టేషన్లలో భద్రత పెంచామని తెలిపారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో అన్ని స్టేషన్లలో ప్రయాణికులను అనుమతిస్తున్నామని చెప్పారు. నిన్నటి ఘటనపై ఇంటర్నల్ విచారణ కొనసాగుతోందని అన్నారు. నష్టం అంచనా వివరాలు సేకరించామని రాకేశ్ చెప్పారు. నిన్న రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులకు రీఫండ్ ఇస్తామని వివరించారు. ప్రయాణికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. అలాగే, ప్రయాణికుల రద్దీ లేని ప్రాంతాల్లో ఎంఎంటీఎస్ రైళ్ళను రద్దు చేశామని తెలిపారు.