Mixing COVID Vaccines : వ్యాక్సిన్ మిక్సింగ్.. ఇదో డేంజరస్ ట్రెండ్ : WHO వార్నింగ్!
వాక్సిన్ మిక్సింగ్పై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ కీలక వ్యాఖ్యలు చేశారు. వ్యాక్సిన్ మిక్సింగ్ ఓ ప్రమాదకర ట్రెండ్ (dangerous trend) మారుతుందంటూ అభిప్రాయపడ్డారు.
Mixing COVID Vaccines : ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ అనేక మ్యుటేషన్లు, వేరియంట్లతో విరుచుకుపడుతోంది. ప్రస్తుత కరోనా వ్యాక్సిన్లు ఎంతవరకు సమర్థవంతంగా కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో కరోనా వేరియంట్లను ఎదుర్కొనేందుకు వీలుగా కరోనా వ్యాక్సిన్లు మిక్సింగ్, మ్యాచింగ్ చేసి ఇవ్వడం ద్వారా ప్రభావంతంతగా పనిచేస్తాయనే వాదన వినిపిస్తోంది. ఈ వాక్సిన్ మిక్సింగ్పై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ కీలక వ్యాఖ్యలు చేశారు. వ్యాక్సిన్ మిక్సింగ్ ఓ ప్రమాదకర ట్రెండ్ (dangerous trend) మారుతుందంటూ అభిప్రాయపడ్డారు.
ప్రజలు తమంతట తాముగా రెండు వేర్వేరు కరోనా టీకాలు తీసుకోవాలనే నిర్ణయానికి రావడం అంత మంచిది కాదన్నారు. టీకా మిక్సింగ్కు సంబంధించి తమ దగ్గర తగినంత సమాచారం, ఆధారాలు అందుబాటులో లేవన్నారు. తమకు అందుబాటులో ఉన్న కొంత డేటాతో మిక్సింగ్ టీకా తీసుకున్న వారిపై ఎంతవరకు ప్రభావం చూపుతుందో చెప్పలేమంటున్నారు. అలాంటి పరిస్థితిలో టీకా ఏ డోసు ఎప్పుడు తీసుకోవాలో ప్రజలు తమతంట తాముగా నిర్ణయించుకుంటే గందరగోళం ఏర్పడుతుందంటూ హెచ్చరించారు.
వేర్వేరు టీకా డోసులు ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతాయో తెలిపే సమాచారం ప్రస్తుతం అందుబాటులో లేదని విషయాన్ని మరవద్దన్నారు. అటు కొన్ని దేశాలు బూస్టర్ డోసు ఇవ్వడంపైనా WHO కీలక వ్యాఖ్యలు చేసింది. బూస్టర్ డోసు అవసరమో, లేదో సమాచారం అందుబాటులో లేదని పేర్కొంది. దీనికి సంబంధించిన అంశాలను సైంటిస్టులు సైతం లోతుగా పరిశోధిస్తున్నారని వెల్లడించింది. కొన్ని దేశాలు తమ ప్రజలకు తొలి డోసు కూడా ఇవ్వలేని స్థితిలో ఉన్నాయని అభిప్రాయపడింది. అదే సమయంలో మరికొన్ని దేశాలు బూస్టర్ డోసు గురించి ఆలోచించడం తొందరపాటు చర్యే అవుతుందని హెచ్చరించింది. బూస్టర్ డోస్ సామర్థ్యంపై ఎలాంటి శాస్త్రపరమైన ఆధారాలు లేవని, లోతుగా అధ్యయనం జరగాల్సి ఉందని పేర్కొంది.