విషాహారం తిని రిజర్వాయర్లో చచ్చిపడి ఉన్న కోతులు..!!దేశంలో మూగ జీవాల మరణఘోష
కేరళలో గర్భిణీ ఏనుగుకు పైనాపిల్ లో బాంబు పెట్టిన కొద్ది రోజులకే మరో దారుణమైన ఘటన వెలుగు చూసింది. మానవత్వం మరిచిపోయిన వ్యక్తి గర్భిణీ ఆవుకు కూడా బాంబు పెట్టిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో దక్షిణ అస్సాంలోని కాచర్ జిల్లాలోని ఓ రిజర్వాయర్ లో 13 కోతులు చచ్చిపడి ఉన్నాయి. ఈ కోతులు ఇలా చనిపోవటానికి కారణం అవి విషాహారం తినటం వల్లనే నని పోస్ట్ మార్టం రిపోర్ట్ లో తేలింది.
కేరళ ఏనుగు దారుణ మరణాన్ని జీర్ణించుకోకముందే.. అసోంలో మరో అమానుష ఘటనతో కలకలం రేగింది. కాఛార్ జిల్లాలోని ఓ రిజర్వాయర్లో దాదాపు 13 కోతుల మృతదేహాలు లభ్యమవ్వడం కలకలం రేపుతోంది. పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన కటిరైల్ నీటి సరఫరా ప్లాంట్లో కోతుల మృతదేహాలు తేలుతూ కనిపించటంతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు.
కోతులను పోస్ట్ మార్టం రిపోర్ట్ లో విషపూరిత పదార్దాలుతినటం వల్లనే చనిపోయాయని తేలింది. దీనిపై మరింత దృవీకరణ కోసం పోస్ట్ మార్టం చేసిన కోతులను గువహతిలోని ఖనపారా వెటర్నరీ డిపార్ట్ మెంట్ డిసీజ్ డయాగ్నొస్టిక్ లాబొరేటరీకి తరలిస్తున్నామని ఓ అధికారి తెలిపారు.
ఈ రిజర్వాయర్ లోని నీటిపై వందలాది కుటుంబాలు నీటి అవసరాల కోసం ఈ రిజర్వాయర్ పైనే ఆధారపడుతున్నారు. కాగా..గౌహతిలో ఓ చిరుతను దారుణంగా చంపి.. దాని గోర్లు, పళ్లు తీసుకున్న ఘటన జరిగిన గంటల వ్యవధిలోనే ఇలా కోతుల మృతదేహాలు లభించడం అనేక అనుమానాలకు తావిస్తోంది.
కాగా ఇటీవల కాలంలో దేశంలో పలు ప్రాంతాలలో మూగ జీవాల పట్ల పలు అమానుష ఘటనలో చోటుచేసుకుంటున్నాయి. కేరళలో గర్భంతో ఉన్న ఓ ఏనుగు పేలుడు పదార్దాలు తినటం వల్ల చనిపోయింది. మరో ఏనుగు కూడా అనుమానాస్పదంగా మరణించింది. అలాగే కేరళలోనే గర్భంతో ఉన్న ఓ ఆవుకు నాటు బాంబు తినిపించటంతో గోమాత గాయాలపాలైంది. ఈ క్రమంలో కోతులు ఇలా రిజర్వాయర్ లో విషహారం తిని చనిపోవటంతో మూగ జీవాలపై ఈ మారణ హోం ఏమిటి? ఎవరు ఇదంతా చేస్తున్నారు?ఎందుకు చేస్తున్నారు? కావాలనే చేస్తున్నారా? వంటి పలు అనుమానాలు తలెత్తుతున్నాయి.