అసెంబ్లీలోకి గ్యాస్ సిలిండర్లతో ఎమ్మెల్యేలు..హడలిపోయిన సభ్యులు
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో ఒక్కసారిగా తీవ్ర గందరగోళం చెలరేగింది. ఎందుకంటే అసెంబ్లీలోకి కొంతమంది ఎమ్మెల్యేలు LPG Gas సిలిండర్లు పట్టుకుని వచ్చారు. దీంతో సభలోని మిగతా సభ్యులంతా ఉలిక్కిపడ్డారు. హడలిపోయారు.
వివరాల్లోకి వెళితే..యూపీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం సందర్భంగా గవర్నర్ ఆనందీ బెన్ ఉపన్యాసాన్ని ప్రారంభించారు. ఈ సమయంలో కేంద్రం ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ చట్టాన్ని (CAA) వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాలు గవర్నర్ ప్రసంగానికి అడ్డు తగిలాయి. సమాజ్ వాదీ పార్టీ సభ్యులతో పాటు మరికొంత మంది విపక్ష సభ్యులు సీఏఏ వ్యతిరేక నినాదాలు చేస్తూ..సభలో ప్లకార్డులు ప్రదర్శించారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. అంతేకాదు..కొందరు ఎమ్మెల్యేలైతే ఏకంగా LPG Gas సిలిండర్లను భుజాన వేసుకుని రావడంతో ఒక్క సారిగా సభలో ఉన్నవారంతా ఉలిక్కిపడ్డారు.హడలిపోయారు.గ్యాస్ ధరలు పెరగటాన్ని నిరసిస్తూ వారు గ్యాస్ సిలిండర్లను పట్టుకొచ్చి తమ నిరసన తెలిపారు. అలాగే బీజేపీ ప్రభుత్వ హయాంలో హింస బాగా పెరిగిందనీ..లా అండ్ ఆర్డర్ సక్రమంగాపనిచేయటంలేదని నిరసన వ్యక్తంచేశారు.
అలా కాసేపటికి కొంతమంది కాంగ్రెస్ సభ్యులు పెరిగిన టమాట ధరలు పెంపుపై నిరసిస్తూ దారివెంట వెళ్లే వారికి టమాటలను పంచి పెట్టి నిరసన వ్యక్తం చేశారు. మరోవైపు ఈ బడ్జెట్ సమావేశాల్లో ఎలాగైనా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి విపక్షాలు సన్నద్ధమయ్యాయి. కేంద్రం తెచ్చిన సీఏఏతో పాటు ఎన్నార్సీపై కూడా ప్రభుత్వాన్ని నిలదీస్తామని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రకటించారు.