Pappadam: పప్పడం వేయలేదని పెళ్లిలో గొడవ.. కుర్చీలు విరగ్గొడుతూ నానా హంగామా
‘పప్పడం అడిగితే వేయరా?’ అంటూ పెళ్లికి వచ్చిన సదరు అతిథి కోపంతో ఊగిపోతూ గోడవకు తెరలేపాడు. ఆయనకు మద్దతుగా మరికొందరు అతిథులు వచ్చి చేరారు. అంతే హాలులో ఉన్న కుర్చీలు విరగ్గొడుతూ, ఇతర ఫర్నీచర్ ధ్వంసం చేస్తూ నానా హంగామా చేశారు.
Pappadam: పెళ్లి అంటే విందు, వినోదం.. అతిథుల మర్యాదలకు ఏమాత్రం తక్కువ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. ఏదైనా తేడా వస్తే.. జరిగే పరిణామాలను తరుచూ చూస్తూనే ఉంటాం. ముఖ్యంగా తెలంగాణ పల్లెల్లో జరిగే పెళ్లిల్లలో విందు ఏర్పాట్లు చాలా జాగ్రత్తగా చేస్తారు. వడ్డించడంలో ఒక ముక్క తగ్గిందా ఇక అంతే సంగతులు(పెళ్లిల్లలో మాంసం ఎక్కువగా తింటారు). పెళ్లి అంతా రచ్చ రచ్చ అవుతుంది. కేరళలో ఓ పెళ్లిలో ఇలాంటి సంఘటనే జరిగింది. పప్పడం(పూరీలాంటిది) మళ్లీ పెట్టకపోవడం పెద్ద సమస్యగా మారింది.
కేరళలోని అలప్పుజలో తాజాగా ఒక పెళ్లి జరిగింది. పెళ్లి విందులో రకరకాల పదార్థాలతో భోజన ఏర్పాట్లు చేశారు. ఇందులో పప్పడం ఒకటి. అయితే ఒక వ్యక్తి ముందుగా పప్పడం వేసుకుని మళ్లీ వెళ్లి ఇంకొకటి అడిగాడు. దానికి వాళ్లు వేయమని చెప్పారు. అంతే ‘పప్పడం అడిగితే వేయరా?’ అంటూ పెళ్లికి వచ్చిన సదరు అతిథి కోపంతో ఊగిపోతూ గోడవకు తెరలేపాడు. ఆయనకు మద్దతుగా మరికొందరు అతిథులు వచ్చి చేరారు. అంతే హాలులో ఉన్న కుర్చీలు విరగ్గొడుతూ, ఇతర ఫర్నీచర్ ధ్వంసం చేస్తూ నానా హంగామా చేశారు.
ఈ గొడవ కారణంగా ఆడిటోరియంలోని 1.5 లక్షల రూపాయల విలువైన ఫర్నీచర్ ధ్వంసమైంది. కాగా ఆడిటోరియం యజమాని మురళీధరన్తో పాటు జోహాన్, హరి అనే మరో ఇద్దరు అతిథులు గాయపడ్డారు. అంతే కాకుండా ఆడిటోరియం యజమాని మురళీధరన్ ఇచ్చిన ఫిర్యాదుతో గొడవకు సంబంధించి 15 మందిపై కేసు నమోదైనట్లు పోలీసులు తెలిపారు.