కరోనా విలయం : ఊపిరి ఆడని తల్లికి నోటితో శ్వాస అందించటానికి కూతురు యత్నం..

కరోనా విలయం : ఊపిరి ఆడని తల్లికి నోటితో శ్వాస అందించటానికి కూతురు యత్నం..

Daughter Tries Resuscitate Mother Breathing Mouth

daughter tries resuscitate mother breathing mouth : కరోనా సోకి..శ్వాస అందక తల్లడిల్లిపోతున్న తల్లిని బతికించుకోవటానికి ఆమె కూతురు పెద్ద సాహసమే చేసింది. తల్లి నోట్లో తన నోరు పెట్టి శ్వాసం అందించటానికి శతవిధాలా యత్నించింది. కరోనా ఉన్న తల్లి నుంచి తనకు కూడా మహమ్మారి సోకుతుందనే ఏమాత్రం ఆలోచించలేదు. తల్లి బతికితే చాలు అనుకుంది.శ్వాస అందక తల్లిడిల్లిపోతున్న తల్లికి తన నోటిని తల్లి నోట్లో పెట్టి శ్వాస అందించటానికి యత్నించింది. కానీ ఫలితం లేదు. తల్లి దక్కలేదు. దీంతో భోరున ఏడుస్తున్న వారిని ఓదార్చటం ఎవరి వల్లా కాలేదు.ఈ విషాదకర ఘటన ఉత్తరప్రదేశ్‌లో భైరాచి జిల్లాలో చోటు చేసుకుంది.

దేశంలో కరోనా మహమ్మారి అల్లకల్లోలం సృష్టిస్తోంది. మరణహోమం సృష్టిస్తోంది. ఫస్ట్ వేవ్ కంటే సెకండ్ వేవ్ ఉదృతి భీకరంగా ఉంది. జనాల ప్రాణాలు పిట్టల్లా రాలిపోతున్నాయి. దేశంలో పలు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో ఆసుపత్రిలో బాధితులకు బెడ్స్‌ లేక, ఆక్సిజన్‌ అందుబాటులో లేక ఎంతోమంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోతున్నారు. తమ వారిని కాపాడుకునేందుకు శత విధాల ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకున్న ఓ హృదయ విదారక ఘటన అందరినీ కలచివేస్తోంది. భైరాచి జిల్లాలో ఓ తల్లి కరోనా బారిన పడింది. ఆమె ఇద్దరు కూతుళ్లు ఆసుపత్రికి తరలించారు.

అక్కడ వైద్యులు చికిత్స అందించే లోపే బాధితురాలి పరిస్థితి విషమంగా మారింది. ఆక్సిజన్‌ అందుబాటులో లేకపోవడంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడి ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లింది. దీంతో తల్లిని ఎలాగైనా కాపాడుకోవడం కోసం ఓ కూతురు తన నోటితో శ్వాస అందిస్తూ అమ్మను బ్రతికించుకునే ప్రయత్నం చేసింది. కానీ ఫలితం దక్కలేదు. ఇక దృశ్యాలు చూసిన ఆస్పత్రి సిబ్బంది, స్థానికులు చలించిపోయారు. కోవిడ్‌ బారినపడి ఊపిరాడక అల్లాడిపోతున్న తల్లిని కాపాడుకునేందుకు కూతురు పడ్డ కష్టం పలువురిని కంటతడి పెట్టిస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.

కాగా..ఇటీవలే ఉత్తరప్రదేశ్‌లోఇలాంటి ఘటనే చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఓ భార్య తన భర్తకు నోటిలో నోరు పెట్టి శ్వాసను అందించింది. ఆగ్రాకు చెందిన రేణు సింఘాల్​ అనే మహిళ.. కరోనా సోకిన తన భర్త రవి సింఘాల్​ను కాపాడుకోవడానికి..కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న భర్త నోటిలో నోరు పెట్టి శ్వాసనందించింది. అయినప్పటికీ ఫలితం దక్కలేదు. భర్త ప్రాణాలు నిలవలేదు. కరోనా కాటుకు ఆమె భర్త ప్రాణాలు కోల్పోయాడు. అలాగే ఈ తల్లి కూడా కరోనా కోరలకు బలైపోయింది.