రూ.కోటి విరాళం ప్రకటించిన హెరిటేజ్ ఫుడ్స్
కరోనా సహాయక చర్యల కోసం హెరిటేజ్ ఫుడ్స్ రూ.కోటి విరాళం ప్రకటించింది. ఈ మొత్తాన్ని వివిధ రాష్ట్రాల సీఎం సహాయనిధికి విరాళంగా ఇవ్వనున్నట్టు హెరిటేజ్ ఫుడ్స్ ఎండీ నారా భువనేశ్వరి వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ సీఎం సహాయనిధికి రూ.30లక్షలు, తెలంగాణ సీఎం సహాయ నిధికి రూ.30లక్షలు, కర్ణాటక సీఎం సహాయనిధికి రూ.10లక్షలు, తమిళనాడు సీఎం సహాయ నిధికి రూ.10లక్షలు, ఢిల్లీ సీఎం సహాయ నిధికి రూ.10లక్షలు, మహారాష్ట్ర సీఎం సహాయ నిధికి రూ.10లక్షలు విరాళంగా ఇవ్వనున్నట్లు ఆమె ప్రకటించారు.
దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నందున కరోనా వ్యాప్తిని ఎదుర్కోవడానికి ప్రభుత్వాలు చేస్తున్న కృషిని అభినందిస్తూ.. తమవంతు సాయంగా కొంత మొత్తాన్ని అందించాలని నిర్ణయించినట్లు భువనేశ్వరి తెలిపారు. సామాజిక బాధ్యత కలిగిన కార్పొరేట్ సంస్థగా కరోనా నివారణ కోసం కృషి చేస్తున్న ప్రభుత్వాలకు అన్ని విధాలా సాయం అందించేందుకు కంపెనీ యాజమాన్యం సిద్ధంగా ఉందని ప్రకటించారు.
ప్రజలంతా ఇళ్లలోనే ఉంటూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని ఆమె ఈ సంధర్భంగా కోరారు. భౌతిక దూరం పాటిస్తూ కరోనా మహమ్మారిని ఎదుర్కోవాలని భువనేశ్వరి పిలుపునిచ్చారు.