Uniform Civil Code: ఉమ్మడి పౌరస్మృతి అంటే ఏమిటి.. దాని వల్ల కలిగే ప్రయోజనాలేంటి?

ఉమ్మడి పౌరస్మృతి వల్ల కలిగే ప్రయోజనాల్లో.. ప్రధానంగా కులం, మతం, వర్గం, స్త్రీ, పురుష లింగ భేదాలకు అతీతంగా.. దేశంలోని పౌరులందరికీ సమాన హోదా లభిస్తుంది.

Uniform Civil Code: ఉమ్మడి పౌరస్మృతి అంటే ఏమిటి.. దాని వల్ల కలిగే ప్రయోజనాలేంటి?

Uniform Civil Code in India

Uniform Civil Code – Article 44: ఒకే దేశం.. ఒకే చట్టం.. ఉమ్మడి పౌరస్మృతి అంటే ఇంతేనా? వినడానికి ఇంత సింపుల్‌గా ఉన్నా.. అమలు అంత ఈజీ కాదా? యూనిఫామ్ సివిల్ కోడ్‌పై ఎందుకు వ్యతిరేకత వస్తోంది. మత సంస్థలు ఎందుకు ఒప్పుకోవడం లేదు. ఉమ్మడి పౌరస్మృతి వల్ల కలిగే ప్రయోజనాలేంటి? తలెత్తబోయే సమస్యలేంటి? కేంద్రంలోని బీజేపీ సర్కార్.. యూనిఫామ్ సివిల్ కోడ్‌ని ఎందుకింత సీరియస్‌గా తీసుకుంది? ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పినట్లుగా కచ్చితంగా అమలు చేసే తీరుతుందా? ఇంతటి వ్యతిరేకత మధ్య.. అది సాధ్యమయ్యే పనేనా?

యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఏమిటి? ముందు దీని గురించి తెలిస్తేనే.. ఇది ఎందుకంత సున్నితమైన అంశంగా మారిందో అర్థమవుతుంది. కొన్ని వర్గాల వారు ఎందుకు దీనిని వ్యతిరేకిస్తున్నారో.. బీజేపీ సర్కార్ ఎందుకు దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకుందో తెలుస్తుంది. ఉమ్మడి పౌరస్మృతి అంటే.. మతపరమైన అచారాలు, సంప్రదాయాలకు అతీతంగా.. భారత భూభాగం పరిధిలో ఉన్న పౌరులందరికీ ఒకే చట్టాన్ని వర్తింపజేయడం. ఈ దేశంలో పెళ్లిళ్లు, విడాకులు, వారసత్వంగా వచ్చే ఆస్తులు, పిల్లలను దత్తత తీసుకోవడం, జీవనభృతి లాంటి విషయాలకు సంబంధించి.. చట్టాలు అందరికీ ఒకేలా లేవు. పౌరులు ఆచరించే మతం, విశ్వాసాల ఆధారంగా ఒక్కో వ్యక్తికి.. చట్టం ఒక్కోలా ఉంది. అయితే.. మతంతో సంబంధం లేకుండా, లింగ భేదాల్లేకుండా.. భారత పౌరులందరికీ ఒకే చట్టం వర్తింపజేయడమే.. యూనిఫాం సివిల్ కోడ్. ఈ డిమాండ్.. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచే ఉంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్- 44 కూడా ఇదే చెబుతోంది. దేశ పౌరులకు యూనిఫాం సివిల్ కోడ్ తీసుకొచ్చేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలంటూ ఆదేశిక సూత్రాల రూపంలో రాజ్యాంగం సూచిస్తోంది.

ఇప్పటివరకు.. దేశంలో ప్రజా చట్టాలకు భిన్నంగా మతపరమైన చట్టాలున్నాయి. హిందూ వివాహ, వారసత్వ చట్టాలు, షరియా లాంటి ముస్లిం పర్సనల్ చట్టాలు అమలవుతున్నాయి. అయితే.. ఉమ్మడి పౌరస్మృతిలో ఎవరికి వాళ్లుగా అమలు చేసుకునే చట్టాలు చెల్లవు. దాంతో.. చాలాకాలంగా దేశంలో మెజారిటీ అయిన హిందువులు, మైనారిటీ అయిన ముస్లింలు.. యూనిఫాం సివిల్ కోడ్‌ని వ్యతిరేకిస్తూ వచ్చారు. ఇప్పుడు.. మళ్లీ ఉమ్మడి పౌరస్మృతి అంశంపై చర్చ మొదలవడంతో.. ముస్లింల షరియా చట్టాలకు కౌంటర్‌గానే యూనిఫాం సివిల్ కోడ్ తెస్తున్నారనే అభిప్రాయాలున్నాయి. షరియా చట్టాలు అనాగరికంగా ఉన్నాయనేదే వాళ్ల వాదన. ఇందుకు.. ఇస్లాం మతంలో భార్యలకు విడాకులిచ్చే ట్రిపుల్ తలాక్‌ని ఎగ్జాంపుల్‌గా చూపిస్తున్నారు. 2019లో ట్రిపుల్ తలాక్‌ని నేరంగా మారుస్తూ.. కేంద్ర ప్రభుత్వం చట్టం చేసింది. యూనిఫాం సివిల్ కోడ్ వచ్చే దాకా.. దేశంలో లింగ సమానత్వం సాధ్యం కాదనే వాదనలున్నాయ్. కానీ.. ఉమ్మడి పౌరస్మృతి వల్ల కలిగే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని, కొత్త సమస్యలు పుట్టుకొస్తాయని చెబుతున్నారు విశ్లేషకులు.

భారత రాజ్యాంగంలోని 25వ అధికరణంలోని.. కొన్ని అంశాలతో ఉమ్మడి పౌర స్మృతి విభేదిస్తుందనే వాదనలు కూడా ఉన్నాయ్. పౌరులు తమకు నచ్చిన మతాన్ని స్వీకరించేందుకు, అనుసరించేందుకు, వ్యాప్తి చేసేందుకు ఆర్టికల్‌ 25 వీలు కల్పిస్తుంది. కానీ.. యూనిఫామ్ సివిల్ కోడ్ వల్ల మత స్వేచ్ఛ విషయంలో ఎలాంటి మార్పులుండవు. అయితే.. భిన్న మతాలు, నమ్మకాలున్న భారత్ లాంటి పెద్ద దేశాల్లో… సివిల్ కోడ్స్ ద్వారా అందరినీ ఏకం చేయడమనేది ఎంతో కష్టమైన విషయం. హిందువులైనా, ముస్లింలైనా.. వాళ్లలో వాళ్లకు అనేక భిన్నమైన నమ్మకాలు, విశ్వాసాలు ఉంటాయి. హిందువుల్లోనూ.. భిన్న ఆచారాలు, సంప్రదాయాలు పాటించే వాళ్లున్నారు. ముస్లింలలోనూ.. షరియా చట్టాలను పాటించని వాళ్లున్నారు. బోరా ముస్లింలు.. ఆస్తుల వారసత్వం విషయంలో హిందువుల చట్టాలను అనుసరిస్తుంటారు. ఆస్తుల వారసత్వం విషయంలో.. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా చట్టాలున్నాయ్.

Also Read: ఒకప్పుడు ఆటో డ్రైవర్.. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.. మంత్రి అయ్యే అవకాశం.. రత్నేష్ సదా ఇంట్రెస్టింగ్ లైఫ్ స్టోరి

ఇక.. క్రైస్తవులు మెజారిటీగా ఉండే నాగాలాండ్, మిజోరం లాంటి రాష్ట్రాలు తమకంటూ ప్రత్యేకమైన సివిల్ చట్టాలను రూపొందించుకున్నాయ్. వాటికి ఆధారం.. వారి సంప్రదాయాలే గానీ మతం కాదు. గోవాలో 1867 నాటి కామన్ సివిల్ కోడ్ అమల్లో ఉంది. కానీ.. క్యాథలిక్స్, ఇతర మతస్థులకు భిన్నమైన నియమాలున్నాయ్. భారత్‌లో పౌర స్మృతులు.. ఉమ్మడి జాబితాలో ఉన్నాయి. అందువల్ల 1970ల నుంచి రాష్ట్రాలు తమకంటూ సొంత సివిల్ కోడ్‌ని రూపొందించుకుంటూ వస్తున్నాయ్. హిందువుల్లో.. కొడుకులతో సమానంగా కూతుళ్లకు వారసత్వ ఆస్తిలో వాటా పొందేలా 2005లో చట్టాలను సవరించారు. కానీ.. దీనికంటే ముందే ఐదు రాష్ట్రాలు.. మహిళలకు వారసత్వ ఆస్తిలో వాటా హక్కును కల్పిస్తూ చట్టాలు చేశాయి.

Also Read: 16,000 గుండె ఆపరేషన్లు చేసిన కార్డియాలజిస్ట్ 41 ఏళ్లకే గుండెపోటుతో మృతి

ఉమ్మడి పౌరస్మృతి వల్ల కలిగే ప్రయోజనాల్లో.. ప్రధానంగా కులం, మతం, వర్గం, స్త్రీ, పురుష లింగ భేదాలకు అతీతంగా.. దేశంలోని పౌరులందరికీ సమాన హోదా లభిస్తుంది. చట్టప్రకారం ఆడ, మగ ఇద్దరూ సమానమేననే.. లింగ సమానత్వం సాధించొచ్చు. క్రిమినల్, సివిల్ చట్టాలన్నీ అందరికీ సమానమవుతాయి. ప్రస్తుతమున్న పర్సనల్ చట్టాలను సంస్కరించాల్సిన పనిలేదు. బహుభార్యత్వం నేరమవుతుంది. అన్ని మతాల్లో.. చిన్న కుటుంబం తప్పనిసరి చేసే అవకాశం కలుగుతుంది. దేశ సమగ్రతని సాధించేందుకు వీలవుతుంది. జాతీయత పట్ల భ్రమలు తొలగిపోయి.. భారతీయత భావం పెంపొందుతుంది. అయితే.. యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు వల్ల కొన్ని ప్రతికూలతలూ ఉన్నాయనే వాదనలు వినిపిస్తున్నాయ్. ఉమ్మడి పౌరస్మృతి తమ మతంపై, సంస్కృతిపై దాడి అని.. ముస్లింలు సహా మిగతా మైనారిటీ వర్గాలు భావించే అవకాశం ఉంది. మతం లాంటి వ్యక్తిగత విషయాల్లో ప్రభుత్వ జోక్యమేంటనే నిరసనలు తలెత్తొచ్చు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ద్వారా సంక్రమించే మత స్వేచ్ఛకు అడ్డంకిగా భావించొచ్చు. ప్రజల భావోద్వేగాలకు సంబంధించిన సున్నితమైన అంశం కావడం వల్ల.. కొందరు దీనిని వ్యతిరేకించొచ్చు.

Also Read: నెహ్రూ మెమోరియల్ పేరు మార్చిన కేంద్రం.. కొత్త పేరేంటో తెలుసా?

ఇప్పటివరకు ఉమ్మడి పౌర స్మృతి అంశంపై కోర్టులు కూడా స్పష్టమైన ఆదేశాలివ్వలేదు. గడిచిన 40 ఏళ్లలో.. భిన్న తీర్పుల్లో భాగంగా.. దేశ సమైక్యత కోసం యూనిఫాం సివిల్ కోడ్ తీసుకురావాలని.. సుప్రీంకోర్టు ప్రభుత్వాలకు సూచిస్తూ వచ్చింది. అయితే.. తీవ్రమైన పరిణామాలకు దారితీసే ఉమ్మడి పౌర స్మృతిని తీసుకురావడం కంటే.. లింగ అసమానతలను తొలగించేందుకు.. పౌర స్మృతులను సవరణ చేస్తే సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు. కానీ.. ఆ పరిస్థితులు కనిపించడం లేదు. ఇప్పుడు.. యూనిఫాం సివిల్ కోడ్‌కు సంబంధించి.. 22వ లా కమిషన్ చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణ ముగిశాక.. ఎలాంటి పరిణామాలు తలెత్తుతాయన్నది ఆసక్తిగా మారింది.

కేంద్రంలోని బీజేపీ సర్కార్.. యూనిఫామ్ సివిల్ కోడ్‌ని ఎందుకింత సీరియస్‌గా తీసుకుంది?.. వివరాలకు ఈ వీడియో చూడండి.