Revanth Reddy : వికారాబాద్‌ కాంగ్రెస్‌లో కీలక పరిణామం.. రాజకీయ ప్రత్యర్థులతో చేతులు కలిపిన రేవంత్ రెడ్డి

బీఆర్ఎస్, బీజేపీ నేతలు చాలామంది కాంగ్రెస్ తో టచ్ లో ఉన్నారని రేవంత్ రెడ్డి బాంబు పేల్చారు. Revanth Reddy - A Chandrasekhar

Revanth Reddy : వికారాబాద్‌ కాంగ్రెస్‌లో కీలక పరిణామం.. రాజకీయ ప్రత్యర్థులతో చేతులు కలిపిన రేవంత్ రెడ్డి

Revanth Reddy - A Chandrasekhar (Photo : Twitter)

Revanth Reddy – A Chandrasekhar : వికారాబాద్ కాంగ్రెస్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాజకీయ ప్రత్యర్థులు గడ్డం ప్రసాద్, ఏ. చంద్రశేఖర్ చేతులు కలిపారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఉద్యమ ఆకాంక్షల కోసం కలిసి పని చేయాలని వారిద్దరికీ విజ్ఞప్తి చేశారు రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు వ్యతిరేకంగా జరుగుతున్న రాజకీయ పునరేకీకరణలో భాగంగా ఏ.చంద్రశేఖర్ ను కాంగ్రెస్ లోకి ఆహ్వానించాం అని రేవంత్ రెడ్డి తెలిపారు.

ఈ నెల 18న కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలంగాణలో పర్యటిస్తున్నారని రేవంత్ రెడ్డి చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే దళిత గిరిజనులకు సంపూర్ణ యాజమాన్య హక్కులు ఇస్తామన్నారు. పేదల భూములు కాపాడాల్సిన ప్రభుత్వమే కబ్జా కోరుగా మారిందని బీఆర్ఎస్ సర్కార్ పై మండిపడ్డారు.

Also Read..BRS Candidates First List : తెలంగాణలో ఎన్నికల కోలాహలం.. 78మందితో బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితా సిద్ధం, 10టీవీ ఎక్స్‌క్లూజివ్ రిపోర్ట్

ప్రత్యక్షంగా పరోక్షంగా బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అన్నారు. బీఆర్ఎస్, బీజేపీ నేతలు చాలామంది కాంగ్రెస్ తో టచ్ లో ఉన్నారని రేవంత్ రెడ్డి బాంబు పేల్చారు. రాష్ట్రంలో‌ కేసీఆర్.. కేంద్రంలో మోదీ ఉండాలని ఒకరికొకరు సహకరించుకుంటున్నారు అని విమర్శించారు. ఎస్సీ వర్గీకరణ పంచాయితీ, గిరిజన లంబాడీల పంచాయితీని కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తెంచుతామని ప్రకటించారు. తెలంగాణకు జరుగుతున్న నష్టాన్ని నివారించటానికి ఉద్యమకారులను కాంగ్రెస్ లోకి ఆహ్వానిస్తున్నాం అని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చెప్పారు.

మరోవైపు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాష్ట్రానికి రానున్నారు. ఈ నెల 18న చేవెళ్లల్లో కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ నిర్వహిస్తామని ఆ పార్టీ నేతలు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ సభకు ముఖ్య అతిథిగా మల్లికార్జున ఖర్గే హాజరుకానున్నారని వెల్లడించారు. ఈ సమావేశంలో ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు. ఇక, ఇదే సభలోనే మాజీమంత్రి ఏ.చంద్రశేఖర్ కాంగ్రెస్ లో చేరనున్నారని సమాచారం.

గత రాత్రి బీజేపీకి రాజీనామా చేశారు మాజీమంత్రి ఏ.చంద్రశేఖర్. త్వరలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారని సమాచారం. జహీరాబాద్ నుంచి ఏ.చంద్రశేఖర్ పోటీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

కాగా.. సీనియర్ నేత, మాజీమంత్రి చంద్రశేఖర్ బీజేపీని వీడిన సంగతి తెలిసిందే. ఆయన బీజేపీకి రాజీనామా చేశారు. పార్టీలో పని చేసే వారికి తగిన ప్రోత్సాహం లేదని చంద్రశేఖర్ ఆరోపించారు. 1985-2008 మధ్య వికారాబాద్ నియోజకవర్గం నుంచి వరుసగా 5 సార్లు ఎమ్మెల్యేగా చంద్రశేఖర్ ఎన్నికయ్యారు. 2018 ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి ఓడిపోయారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పెద్దపల్లి నుంచి ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత బీజేపీలో చేరారు.

Also Read..Congress Candidates First List : తెలంగాణలో ఎన్నికల కోలాహలం.. కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా సిద్ధం, 10టీవీ ఎక్స్‌క్లూజివ్ రిపోర్ట్

కొంతకాలంగా ఆయన పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవల పార్టీ నిర్వహణ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి మనసు మార్చే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. బీజేపీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. బండి సంజయ్ ను బీజేపీ అధ్యక్షుడి బాధ్యతల నుంచి తప్పించడంతో చంద్రశేఖర్ మనస్తాపం చెందారని, అందుకే తీవ్ర నిర్ణయం తీసుకున్నారని సమాచారం. బండి‌ సంజయ్ ను తొలగించినప్పటి నుంచి చంద్రశేఖర్ అసంతృప్తిగా ఉన్నారట. బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్వయంగా మాట్లాడినప్పటికీ చంద్రశేఖర్ మాత్రం పార్టీ కార్యకలాపాలకు దూరంగానే ఉన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని చంద్రశేఖర్ ఆరోపణలు చేశారు.