Cancer Cases Rising in Chintalapudi : 10టీవీ ఎఫెక్ట్.. చింతలపూడి నియోజకవర్గంలో కోరలుచాచిన కాన్సర్పై వరుస కథనాలు.. కదిలొచ్చిన అధికార యంత్రాంగం.. స్పందించిన మంత్రి
Cancer Cases Rising in Chintalapudi : ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గంలో క్యాన్సర్ రోగుల పెరుగుదలపై 10టీవీ కథనానికి స్పందించిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఇన్చార్జి అధికారిని డాక్టర్ యూ. శోభ, వైద్య బృందం ఎండపల్లి, రాఘవాపురం ప్రాంతాల్లో పర్యటించారు.
10TV reports on cancer patients in Chintalapudi constituency Officials respond
Cancer Cases Rising in Chintalapudi : ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో కోరలుచాచిన క్యాన్సర్పై 10టీవీ వరుస కథనాలు ప్రసారం చేసింది. బాధితుల బాధలను వెలుగులోకి తెచ్చింది. అక్కడి క్షేత్ర స్థాయి పరిస్థితిని అందరికీ తెలిసేలా కళ్లకుకట్టినట్లు 10టీవీ చూపించింది.
ముఖ్యంగా ఎండవల్లి, రాఘవాపురం ప్రాంతాల్లో క్యాన్సర్ భూతానికి చిక్కిన ప్రతి ఇంటిలోని కన్నీటి కథను వ్యధను 10టీవీ ప్రత్యేక కథనాల ద్వారా చూపించింది. అటు ఆశా వర్కర్ల పనిని.. స్థానిక ఎమ్మెల్యే చేస్తున్న కృషిని కూడా తెలియజేసింది. చింతలపుడి నియోజకవర్గంలో క్యాన్సర్ భూతంపై 10టీవీలో ప్రసారమైన వరుస కథనాలతో రాష్ట్ర అధికార యంత్రాంగం అలర్ట్ అయింది. ఏకంగా వైద్యఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఈ కథనాలపై స్పందించి అధికారులను అప్రమత్తం చేశారు. వెంటనే అక్కడికి వైద్యాధికారులు చేరుకొని తదుపరి చేర్యలు చేపట్టారు.
ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గంలో క్యాన్సర్ రోగుల పెరుగుదలపై 10టీవీ కథనానికి స్పందించిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఇన్చార్జి అధికారిని డాక్టర్ యూ. శోభ, వైద్య బృందం ఎండపల్లి, రాఘవాపురం ప్రాంతాల్లో పర్యటించారు. రాఘవాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని ఎండపల్లి, రాఘవపురం పరిసర ప్రాంతాల్లో క్యాన్సర్ బాధిత రోగుల వివరాలు వారు సేకరించారు.
ఈ సందర్భంగా 10టీవీతో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ శోభ మాట్లాడుతూ.. చింతలపూడి నియోజకవర్గంలో క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని 10టీవీలో ప్రసారం చేసిన తర్వాత ఈ ప్రాంతంలో పర్యటించామని తెలిపారు. ప్రస్తుతం గుర్తించబడిన 8 కేసులు ఉన్నాయని, రాఘవపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఎనిమిది మంది చికిత్స పొందుతున్నారని తెలిపారు. క్యాన్సర్ వ్యాధిపై అవగాహన పెంపొందించేందుకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యశ్రీ ద్వారా వైద్య చికిత్స జరుగుతుందని తెలిపారు. క్యాన్సర్ వ్యాధి పెరగకుండా చిన్నారులకు ప్రభుత్వం అందించే ఉచిత వ్యాక్సిన్ జిల్లావ్యాప్తంగా అందుబాటులో ఉందని, భవిష్యత్తులో ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహించేందుకు స్వచ్ఛంద సంస్థల సహకారంతో మెడికల్ క్యాంపులు నిర్వహిస్తామని తెలిపారు.
అంతకు ముందు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ 10టీవీ కథనాలపై స్పందించారు. చింతలపూడిలో క్యాన్సర్ కేసులపై 10టీవీ కథనాలు నా దృష్టికి వచ్చాయని, కమిషనర్ని వెంటనే దీనిపై దృష్టిసారించాలని ఆదేశించానని తెలిపారు. చింతలపూడి పరిస్థితిపై కమిషనర్ విచారణ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా క్యాన్సర్ తీవ్రత చాలా ఉంది. ఉచిత క్యాన్సర్ పరీక్షల ఫైల్ పైనే మంత్రిగా నేను తొలి సంతకం పెట్టా. క్యాన్సర్ పరీక్షలు నిర్వహించేందుకు 18వేల మందికి శిక్షణ ఇచ్చామని మంత్రి పేర్కొన్నారు. క్యాన్సర్ నివారణపై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పిస్తున్నామని మంత్రి చెప్పారు.
ఇదిలాఉంటే.. రాష్ట్ర వ్యాప్తంగా క్యాన్సర్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. దాదాపు 3వేల కోట్లు క్యాన్సర్ నివారణకు ప్రభుత్వం ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో కోటి 93లక్షల మందికి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేశారు. వీరిలో 1.45లక్షల మందికి క్యాన్సర్ సోకిందని గుర్తించారు. వారందరికీ వైద్య చికిత్సలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అయితే, క్యాన్సర్ ను తొలి దశలోనే గుర్తించేలా ప్రజలు అవగాహన కల్పిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. తొలి దశలో క్యాన్సర్ ను గుర్తించడం ద్వారా 70శాతంకుపైగా క్యాన్సర్ను నయం చేయచ్చునని అధికారులు తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన కల్పిస్తున్నట్లు చెబుతున్నారు.
