AP Deputy CM Narayana Swamy : ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి కంటతడి పెట్టుకున్నారు. సోమవారం (మార్చి 11న) ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. గంగాధర నెల్లూరు వైసీపీ అభ్యర్థిగా పోటీలో ఉన్న కూతురు కృపాలక్ష్మితో కలిసి డిప్యూటీ సీఎం ఆవేదన వ్యక్తం చేశారు.
Read Also : దేశ రక్షణ విషయంలో ఎక్కడా రాజీపడకుండా మోదీ సర్కారు ఏం చేస్తోందో తెలుసా?
తండ్రి నారాయణ స్వామి భావోద్వేగాన్ని చూసి కూతురు కృపాలక్ష్మి సైతం కన్నీరు పెట్టుకున్నారు. తమ నియోజకవర్గంలో తమకు తెలియకుండా ఎవరితోనూ మాట్లాడొద్దని అగ్రకులాలకు చెందిన కొందరు నేతల మాటలు తమకు చాలా బాధ కలిగించాయని ఇద్దరూ ఎమోషనల్ అయ్యారు. చేసే పనిలో నిజాయితీగా ఉన్నప్పుడు ఎవరికీ భయపడకుండా తలవంచకుండా నడుచుకోవాలని కూతురుకు డిప్యూటీ సీఎం ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు.
మాకు అందరూ సమానమే : డిప్యూటీ సీఎం
అల్లారు ముద్దుగా పెరిగిన కూతురుకు ఇలాంటి మాటలు చాలా బాధ కలిగిస్తాయని నారాయణస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో కొందరు నాయకులు తమ మాటే గెలవాలని, వినాలని ఆదేశాలు జారీ చేయడం బాధ కలిగిస్తుందన్నారు. రాజకీయాల్లోకి ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా వచ్చామే తప్ప దాచుకోవాలి, దోచుకోవాలని రాలేదని చెప్పారు. నియోజకవర్గంలో నాయకులు, కార్యకర్తలు అందరూ తమకు సమానమేనని ఆయన స్పష్టం చేశారు.
మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిధున్ రెడ్డి ఆశీస్సులతోనే కృపాలక్ష్మికి గంగాధర నెల్లూరు టికెట్ వచ్చిందని, వారికి జీవితాంతం రుణపడి ఉంటామని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. 10 ఏళ్లు ఆదరించిన గంగాధర నెల్లూరు నియోజకవర్గ ప్రజలు కూతురు కృపాలక్ష్మిని కూడా ఆదరించాలని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఆకాంక్షించారు.
Read Also : భట్టి విక్రమార్కకు జరిగిన అవమానంపై మల్లికార్జున్ ఖర్గే స్పందించాలి : బాల్క సుమన్