తీరనున్న ట్రాఫిక్ కష్టాలు : కనకదుర్గ ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవం

  • Published By: madhu ,Published On : October 16, 2020 / 07:18 AM IST
తీరనున్న ట్రాఫిక్ కష్టాలు : కనకదుర్గ ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవం

Updated On : October 16, 2020 / 8:06 AM IST

AP CM jagan and Central Minister gadkari to open vijayawada kanaka durga flyover : బెజవాడ వాసులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న చిరకాల కోరిక మరికొన్ని గంటల్లో నెరవేరనుంది. కొన్ని నెలలుగా వాయిదా పడుతూ వస్తున్న విజయవాడ కనకదుర్గ ఫ్లై ఓవర్‌ ప్రారంభోత్సవానికి ముహూర్తం ఎట్టకేలకు ఖరారైంది. ఉదయం 11.30 గంటలకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, సీఎం జగన్.. వర్చువల్‌గా ఫ్లై ఓవర్‌ను ప్రారంభించనున్నారు.



అలాగే 61 ప్రాజెక్ట్ పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు జరగనున్నాయి. ఫ్లైఓవర్ ప్రారంభం అయ్యాక మొదటిగా ఆర్ అండ్ బీ మంత్రి శంకర్ నారాయణ, అధికారులు ట్రావెల్ చేస్తారు. కనకదుర్గ ఫ్లైఓవర్‌తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 61 కొత్త ప్రాజెక్టులు ప్రారంభోత్సవం, శంకుస్థాపన కార్యక్రమాలు జరగనున్నాయి. 15వేల 592 కోట్లతో అంచనాలతో 61 ప్రాజెక్టుల పనులను అధికారులు ప్రారంభించనున్నారు.

బెజవాడ వాసుల చిరకాల కోరికను బిజెపి ప్రభుత్వం నెరవేర్చిందన్నారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. మోదీ, నితిన్ గడ్కరీల సహకారంతోనే దుర్గగుడి ఫ్లైఓవర్ పూర్తి అయ్యిందన్నారు. దసరా ముందుగా ఫ్లైఓవర్ వినియోగంలోకి రావడంతో నగరవాసులకు ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయని తెలిపారు.



కనకదుర్గ ఫ్లై ఓవర్ నిర్మాణం పనులు పూర్తై చాలా రోజులైంది. అయితే.. ప్రారంభోత్సవానికి అడ్డంకులు ఏర్పడ్డాయి. వాస్తవానికి సెప్టెంబర్ 4నే దుర్గగుడి ఫ్లెఓవర్‌ను ప్రారంభించాలని అధికారులు నిర్ణయించారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరణంతో దేశంలో ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 6 వరకు సంతాప దినాలు ఉన్నందున ప్రారంభ కార్యక్రమం వాయిదా పడింది.

ఆ తర్వాత సెప్టెంబర్ 18న ముహూర్తం పెట్టినా… కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి కరోనా సోకడంతో.. మళ్లీ వాయిదా పడింది. ఇన్ని వాయిదాల తర్వాత… ఎట్టకేలకు నేడు వారధి అందుబాటులోకి వస్తోంది. ఫ్లైఓవర్ ప్రారంభోత్సవ ఏర్పాట్లను కలెక్టర్ ఇంతియాజ్ పరిశీలించారు. కొన్ని దశాబ్దాలపాటు విజయవాడ నగరవాసులు దుర్గగుడి దగ్గర ట్రాఫిక్‌తో ఇబ్బందులు పడ్డారు. అయితే.. ఫ్లై ఓవర్ పూర్తి కావడంతో ఎట్టకేలకు విజయవాడ వాసుల ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. 50 శాతం ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి.