AP Parishad election results : ఏపీ పరిషత్ ఎన్నికల్లో వైసీపీ విజయ పరంపర కొనసాగింది. రాష్ట్ర ప్రజలంతా వైసీపీకి పట్టం కట్టారు. ప్రతిపక్ష పార్టీ కనీసం పోటీ కూడా ఇవ్వకపోవడంతో… అధికార వైసీపీ పరిషత్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను తన ఖాతాలో వేసుకుంది. అన్ని జిల్లాల్లో దాదాపు 80శాతం ఎంపీటీసీ స్థానాను కైవసం చేసుకుంది వైసీపీ. జెడ్పీటీసీ స్థానాల్లోనూ ఫ్యాన్కు తిరుగులేకుండా పోయింది. అన్ని జెడ్పీ పీఠాలను వైసీపీ క్లీన్స్విప్ చేసే దిశగా వెళ్తోంది.
పరిషత్ ఎన్నికల ఫలితాలపై ఏపీ సీఎం జగన్ స్పందించారు. ఎన్నికలు ఏవైనా గెలుపు తమదేనని తేల్చి చెప్పారు. దేవుడి దయతో పరిషత్ ఎన్నికల్లో విజయం సాధించామని తెలిపారు. 12 కార్పొరేషన్ ఎన్నికల్లోనూ వైసీపీకి కట్టబెట్టారని పేర్కొన్నారు. 86శాతం ఎంపీటీసీలను వైసీపీ కైవసం చేసుకుందని చెప్పారు. 98శాతం జెడ్పీటీసీలను వైసీపీ గెలుచుకుందన్నారు. ప్రతి ఎన్నికల్లోనూ ప్రజలు వైసీపీకి తోడుగా ఉన్నారని పేర్కొన్నారు. విజయాన్ని అందించిన ప్రజలకు జగన్ ధన్యవాదాలు తెలిపారు. ప్రజలకు రుణ పడి ఉంటామని చెప్పారు.
AP Parishad Elections : ఏపీ పరిషత్ ఎన్నికల్లో వైసీపీ హవా..5,916 స్థానాలు కైవసం
సర్పంచ్, మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీదే గెలుపు అన్నారు. వైసీపీ గెలుపును జీర్ణించుకోలేక వక్రభాష్యం చెబుతున్నారని మండిపడ్డారు. ప్రజలకు మంచి చేస్తుంటే.. కోర్టుల్లో కేసులు వేసి అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలను అడ్డుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేశారని విమర్శించారు.
ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని కొన్ని శక్తులు ప్రయత్నించాయని పేర్కొన్నారు. అబద్ధాన్ని నిజం చేయాలని రకరకాల కుయుక్తులు పన్నారని చెప్పారు. ఒటమిని కూడా అంగీకరించలేని పరిస్థితిలో ఉన్నారని తెలిపారు.