అలాంటి వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయొద్దు: ఈసీ
ఇలాంటి పోస్టులను తమ నోటీసుకి వచ్చిన మూడు గంటల్లోగా తొలగించాలని ఏపీ ఎన్నికల సంఘం తెలిపింది.
- Naga Srinivasa Rao Poduri
- Published On : May 7, 2024 / 03:58 PM IST
EC guidelines for social media posts: లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయ పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. ప్రధాన రాజకీయ పార్టీ నాయకుల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. విమర్శలు ప్రతివిమర్శలు, ఆరోపణలు పత్యారోపణలతో ఎన్నికల వాతావరణం హీటెక్కింది. అటు సోషల్ మిడియాలోనూ పార్టీలు పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేస్తున్నాయి. కొన్నిసార్లు రాజకీయ పార్టీల ప్రచారం శృతిమించుతోంది. దీంతో సోషల్ మీడియాలో తప్పుడు పోస్టుల విషయంలో ఏపీ ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది.
మహిళల్ని కించపరచడం, మైనర్లతో ప్రచారం, జంతువులకు హానీ తలపెడుతున్న వీడియోలు, ఫోటోలు.. సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం నిషేధమని ఈసీ ప్రకటించింది. ఇలాంటి పోస్టులను ఈసీ నోటీసుకి వచ్చిన మూడు గంటల్లోగా తొలగించాలని తెలిపింది. నిబంధనలు పాటించకుంటే ఆయా పార్టీల నాయకులపై కేసులు పెడతామని ఈసీ వార్నింగ్ ఇచ్చింది.
అధికారుల నిర్లక్షంపై ఈసీ సీరియస్
పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ బదులు ఈవీఎం బ్యాలెట్(టెండర్ బ్యాలెట్) పేపర్లు ఇవ్వడంతో 1219 మంది ఉద్యోగుల ఓట్లు చెల్లకుండా పోయాయి. వీరందరికీ తిరిగి రెండు రోజుల్లోగా పోస్టల్ బ్యాలెట్ నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలిచ్చింది. సంబంధిత అధికారులపై ఈనెల 9లోగా క్రమశిక్షణ చర్యలకు ఆదేశించింది.
Also Read: ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు ఈసీ బ్రేక్.. నిధుల విడుదలకు అనుమతి నిరాకరణ
