Minister Botsa Satyanarayana
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి ఢిల్లీ పర్యటన నేపథ్యంలో ఆయనపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ఇవాళ అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో కొత్తేముందని ప్రశ్నించారు. ఒకవేళ బీజేపీతో పొత్తు ప్రకటన జరిగితే మాట్లాడతానని అన్నారు.
ఎన్నికల ముందు పొత్తులు కుదుర్చుకోవడం చంద్రబాబుకి అలవాటేనని చెప్పారు. చంద్రబాబు ఎవరితో కలిసినా, కలవకపోయినా ప్రయోజనం ఏముంటుందని నిలదీశారు. తమ పాలనలో ప్రజలకు మంచి చేశామని చెప్పారు. ప్రజలు తమవైపు ఉన్నారని చెప్పారు. ఎన్నికల్లో తామే గెలుస్తామని చెప్పారు.
తమ పార్టీలో కొందరికి అసంతృప్తి ఉంటే ఏం చేస్తామని ప్రశ్నించారు. తాము ఎవరినీ వదులుకోవాలని అనుకోవడం లేదని, టికెట్ రానివారికి కూడా సమీప భవిష్యత్తులో అవకాశాలు ఉంటాయని తెలిపారు. అసంతృప్తి అనేదానికి ఎండ్ అనేదే ఉండదని చెప్పారు. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు భద్రత కల్పించే విషయాన్ని అధికారులు చూసుకుంటారని అన్నారు.
భద్రతపై సర్కారుకు కొన్ని పరిమితులు ఉంటాయని చెప్పారు. ముప్పు ఉంటేనే భద్రత ఉంటుందని అన్నారు. కాగా, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బీజేపీ అధిష్ఠానంతో పొత్తులపై మంతనాలు జరపనున్నారు. ఆయన ఢిల్లీ పర్యటన తర్వాత బీజేపీతో పొత్తులపై క్లారిటీ రానుంది.