Whenever the elections YCP will lose badly says Chandrababu
Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్కు బీసీలు రిటర్న్ గిఫ్ట్ ఇస్తారని, ఆ రోజు దగ్గరలోనే ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఏపీలోని నెల్లూరు జిల్లా, కావలిలో చంద్రబాబు నాయుడు ఇవాళ ‘ఇదేం ఖర్మ మన బీసీలకు?’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జగన్ పై మండిపడ్డారు. బీసీల సంక్షేమంపై శ్వేతపత్రం విడుదల చేయాలని, అలాగే, ఈ విషయంపై చర్చలకు వైసీపీ ప్రభుత్వం సిద్ధమా? అని ఆయన ప్రశ్నించారు.
బీసీల కుల వృత్తులను కూడా జగన్ ఎగతాళి చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. తమ ప్రభుత్వ హయాంలో బీసీల కులవృత్తులను కాపాడామని, వారికి ఆధునిక పనిముట్లు ఇచ్చామని చెప్పారు. చేపలు ఇవ్వడం టీడీపీ సిద్ధాంతం కాదని, చేపలు పట్టడం నేర్పితే వారే బతుకుతారనేదే తమ సిద్ధాంతమని ఆయన చెప్పుకొచ్చారు.
మరోవైపు, చిత్తూరు జిల్లాలోని సోమల మండలం, నంజం పేటలో వైసీపీ, టీడీపీ కార్యకర్తలకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఆ ప్రాంతంలో టీడీపీ నిర్వహించాలనుకున్న ‘ఇదేం ఖర్మ రాష్టానికి’ కార్యక్రమాన్ని వైసీపీ అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ, వైసీపీ కార్యకర్తలు పరస్పరం రాళ్లదాడి చేసుకున్నారు.