ఆయన కొడుకే పోలవరం కంప్లీట్ చేస్తాడు.. 2022నాటికి నీళ్లిస్తాం: CM జగన్

  • Publish Date - December 2, 2020 / 05:11 PM IST

cm jagan:పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ సంధర్భంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. పోలవరం గురించి చంద్రబాబు ఏనాడూ పట్టించుకోలేదని, అసలు ఆలోచించలేదని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్‌కు ఒక వరమని చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న(1995-2004) సమయంలో పోలవరం పట్టించుకోకపోతే వైఎస్ రాజశేఖర్ రెడ్డి వచ్చిన తర్వాత ప్రాజెక్ట్ నిర్మాణంలో కదలిక వచ్చినట్లుగా ఆయన చెప్పుకొచ్చారు.



చంద్రబాబు హయాంలోనే ఎగువున ఉన్న రాష్ట్రాలు ప్రాజెక్టుల ఎత్తును పెంచుకుంటూ ఉంటే.. చంద్రబాబు పట్టించుకోలేదని ఆరోపించారు. 2004లో వైఎస్ ముఖ్యమంత్రి అయిన తర్వాతే పోలవరం కుడి ప్రధాన కాల్వకు 10,327 ఎకరాలకు భూసేకరణ చేసినట్లుగా ఆయన గుర్తు చేశారు. వైఎస్సార్‌ హయాంలో 86 శాతం కుటి ప్రధాన కాల్వ పనులు జరిగితే.. చంద్రబాబు హయాంలో కేవలం 14శాతం పనులు మాత్రమే జరిగినట్లుగా ఆయన చెప్పారు. పోలవరంలో మిగిలిన పనులు చేసేది నీళ్లు ఇచ్చేది వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకేనని, జగనే పోలవరం కంప్లీట్ చేస్తున్నాడని, 2022 ఖరీఫ్ నాటికి నీళ్లు కూడా ఇస్తానని జగన్ చెప్పుకొచ్చారు.



ఎడమ ప్రధాన కాల్వకు కేవలం 0.89 శాతం భూసేకరణ జరిగిందన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ అనుమతులన్నీ వైఎస్సార్‌ హయాంలోనే వచ్చాయని, చంద్రబాబు గత ఐదేళ్ల పాలనలో కేవలం 20 శాతం పనులు మాత్రమే చేసినట్లుగా చెప్పుకొచ్చారు. పోలవరాన్ని చంద్రబాబు ATMలా మార్చుకున్నారంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీనే అన్నారని జగన్ అసెంబ్లీలో చెప్పారు. పోలవరంలో రివర్స్‌ టెండరింగ్ చేస్తే రూ.1343 కోట్లు ప్రభుత్వానికి ఆదా అయినట్లు జగన్ చెప్పారు.