Cyclone Asani Impact : అసని తుపాను.. వాయుగుండంగా మారి బలహీనపడుతుంది

'అసని' తుపాను తీవ్ర వాయుగుండంగా బలహీనపడి కొనసాగుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ డైరెక్టర్ తెలిపారు. మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు.

  • Published on- May 11, 2022 / 10:36 PM IST

Cyclone Asani Impact

Cyclone Asani Impact : ఐఎండీ సూచనల ప్రకారం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ‘అసని’ తుపాను తీవ్ర వాయుగుండంగా బలహీనపడి కొనసాగుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ డైరెక్టర్ డా.బి.ఆర్ అంబేద్కర్ తెలిపారు. గురువారం ఉదయానికి వాయుగుండంగా బలహీనపడనున్నట్లు చెప్పారు.

గడిచిన 6 గంటల్లో గంటకు 7 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయువ్య దిశగా నెమ్మదిగా కదులుతుందన్నారు. ప్రస్తుతం మచిలీపట్నంకు 20 కిలోమీటర్లు, నరసాపురంకు 50 కిలోమీటర్ల, కాకినాడకు 120 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని చెప్పారు. రాత్రికి ఉత్తరం- ఈశాన్య దిశగా కదులుతూ యానాం, కాకినాడ, తుని తీరాల వెంబడి కదులుతూ బంగాళాఖాతంలోకి చేరుకునే అవకాశం ఉందన్నారు.(Cyclone Asani Impact)

Cyclone Asani Impact Will Continue, Landfall Completed At Krishna District

తుపాను బలహీనపడినప్పటికి దీని ప్రభావంతో గురువారం కోస్తాంధ్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సముద్రం అలజడిగా ఉంటుందని, మత్స్యకారులు గురువారం వరకు వేటకు వెళ్లరాదని హెచ్చరించారు.

CM Jagan : అసాని తుపానుపై కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్ సమీక్ష

ఇక, తుపాను నేపధ్యంలో విపత్తుల నిర్వహణ సంస్థలో అత్యవసర సాయం కోసం హెల్ప్‌ లైన్‌ నెంబర్లు(1070 , 18004250101) అందుబాటులో ఉంచారు. ఈ నెంబర్లు 24 గంటలూ పని చేస్తాయన్నారు.

కాగా, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అసని తుపాను కృష్ణా జిల్లా కృత్తివెన్ను సమీపంలో తీరాన్ని దాటింది. భూభాగాన్ని తాకిన అనంతరం బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారినట్టు ఐఎండీ స్పష్టం చేసింది. ప్రస్తుతం ఇది ఈశాన్య దిశగా కదులుతున్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మచిలీపట్నం నుంచి 21 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన తీవ్ర వాయుగుండం మరింత బలహీనపడి వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది ఈశాన్య దిశగా కదులుతూ నర్సాపురం, పాలకొల్లు, అమలాపురం, యానాం, కాకినాడ మీదుగా మళ్లీ సముద్రంలోకి వచ్చే సూచనలు ఉన్నట్టు పేర్కొంది. తదుపరి మరింత బలహీనపడి అల్పపీడనంగా మారుతుందని వెల్లడించింది.

Cyclone Asani : ప్రాణ నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నాం-తానేటి వనిత

వాయుగుండం కదులుతున్న ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, గంటకు 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. మరోవైపు కోస్తాంధ్ర తీర ప్రాంతంలో ప్రకటించిన రెడ్ అలెర్ట్‌ను కొనసాగిస్తున్నారు. మచిలీపట్నం, విశాఖ, నిజాంపట్నం, కాకినాడ, భీమిలి, కళింగపట్నం, గంగవరం పోర్టుల్లో జారీ చేసిన 7 నెంబరు ప్రమాద హెచ్చరికలు కూడా కొనసాగిస్తున్నారు.(Cyclone Asani Impact)