Tpt Rain Update
Karthika Pournami Holy Dip : ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఏపీలో బీభత్సం సృష్టిస్తోంది. అల్పపీడనం బలపడి తుఫాన్ గా మార మారే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా ప్రాంతాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. 2021, నవంబర్ 18వ తేదీ, 19వ తేదీల్లో అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ క్రమంలో…19వ తేదీ శుక్రవారం…కార్తీక పౌర్ణమి సందర్భంగా సముద్రంలో స్నానం చేసేందుకు భారీగా ప్రజలు తరలివస్తారని ముందస్తు అంచనా వేశారు అధికారులు. దీంతో సముద్రంలో స్నానం చేయడానికి అనుమతినివ్వడం లేదని అధికారులు ప్రకటించారు. మచిలీపట్నం ముంగినపూడి బీచ్ లో సముద్ర స్నానాలకు అనుమతి లేదని మచిలీపట్నం ఆర్డీఓ ఖాజావలి తెలిపారు. మండలం హంసలదీవి సాగర సంగమం వద్ద కూడా స్నానాలకు అనుమతినివ్వమని స్పష్టం చేశారు. సాగర సంగమానికి వెళ్లే మార్గాన్ని పోలీసులు మూసివేశారు.
Read More : NIA Officials Raids : తెలుగు రాష్ట్రాల్లో NIA సోదాలు…దాడులు చేయడం అప్రజాస్వామికం – కళ్యాణ్ రావు
మరోవైపు తిరుపతిలో అంధకారం నెలకొందని తెలుస్తోంది. భారీ వర్షాలతో తిరుపతి పట్టణం వణికిపోయింది. ఎక్కడ చూసినా వరదనీరే కనిపిస్తుంది. ఎడతెరిపి లేకుండా..కురుస్తున్న వర్షాలు తిరుపతిని అతలాకుతలం చేస్తున్నాయి. నగరమంతా జలదిగ్భందంలో చిక్కుకుంది. ఉదయ నుంచి వర్షం కురుస్తోంది. దీంతో జనజీవనం స్తంభించిపోయింది. మధాహ్నం 3 గంటల నుంచి తిరుపతిలో కరెంటు సరఫరా నిలిచిపోయిందని, దీంతో పలు ప్రాంతాలు చీకటిలో ఉన్నాయని సమాచారం. నగరంలోని పలు ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలు, కార్లు వరదనీటిలో కొట్టుకపోవడంతో వరద ఉధృతి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
Read More : Indrakeeladri : దుర్గగుడికి జగన్ రూ. 70 కోట్లు ఇచ్చారు..మిగతా సీఎంలు ఇచ్చారా ?
వాయుగుండం శుక్రవారం తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర మధ్య తీరం దాటనుంది. శుక్రవారం తెల్లవారుజామున…చెన్నై సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేస్తున్నారు. వాయుగుండం ప్రభావంతో ఇప్పటికే భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతుండడంతో.. తిరుపతి జలమయమైంది. తిరుమలలో కొండ చరియలు విరిగిపడ్డాయి. నెల్లూరు జిల్లాలో వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కడప జిల్లాలో హైవేపైకి వరద ప్రవాహం పోటెత్తింది. దక్షిణ కోస్తాంధ్ర సముద్ర తీరప్రాంతం గంటకు 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. మత్స్యకారులు సముద్రంలో చేపలవేటకు వెళ్లొద్దని అధికారులు ఆదేశాలు జారీచేశారు