Kurnool Bus Accident : బస్సు ప్రమాదానికి ముందు ఆ కొద్ది క్షణాల్లో ఏం జరిగింది.. బైకర్ శివశంకర్ కుటుంబం ఏం చెప్పిందంటే?

Kurnool Bus Accident బస్సు ప్రమాదంకు ముందు బైక్ పై నుంచి కిందపడి శివశంకర్ అనే వ్యక్తి మరణించాడు. ఆ సమయంలో బైక్ పై ఉన్న ఎర్రిస్వామి అనే వ్యక్తి కూడా ఉన్నాడు.

Kurnool Bus Accident : బస్సు ప్రమాదానికి ముందు ఆ కొద్ది క్షణాల్లో ఏం జరిగింది.. బైకర్ శివశంకర్ కుటుంబం ఏం చెప్పిందంటే?

Kurnool Bus Accident

Updated On : October 26, 2025 / 2:33 PM IST

Kurnool Bus Accident : హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు శుక్రవారం తెల్లవారు జామున ఏపీలోని కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. బస్సుకు మంటలు వ్యాపించి బస్సు దగ్ధమైంది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు, ఆరుగురు మహిళలు సహా మొత్తం 19మంది సజీవదహనం అయ్యారు. ప్రమాదం జరిగిన సమయంలో ఇద్దరు డ్రైవర్లు, నలుగురు చిన్నారులు సహా మొత్తం 46మంది బస్సులో ఉన్నారు.

అయితే, బస్సు ప్రమాదంకు ముందు బైక్ పై నుంచి కిందపడి శివశంకర్ అనే వ్యక్తి మరణించాడు. ఆ సమయంలో బైక్ పై ఉన్న ఎర్రిస్వామి అనే వ్యక్తి కూడా ఉన్నాడు. అతను స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. బైక్ రోడ్డుపై పడి ఉండటంతో వేగంగా వచ్చిన ట్రావెల్స్ బస్సు బైక్ ను ఢీకొట్టి కొద్దిదూరం లాక్కెళ్లింది. ఆ సమయంలో మంటలు వ్యాపించడంతో ఘోర బస్సు ప్రమాదం జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎర్రి స్వామి, శివశంకర్ స్నేహితులు. లక్ష్మీపురం గ్రామం నుంచి అర్ధరాత్రి 2గంటల తరువాత బయలుదేరారు. ఎర్రి స్వామిది దుగ్గలి గ్రామం. అతన్ని డ్రాప్ చేసేందుకు శివశంకర్ వెళ్లాడు. దారిలో ఉన్న పెట్రోల్ బంక్ వద్ద పెట్రోల్ కొట్టించుకున్నారు. చిన్న టేకూరు సమీపంలోకి వచ్చిన తరువాత బండి స్కిడ్ అయింది. ఈ ప్రమాదంలో శివశంకర్ డివైడర్ కు ఢీకొని అక్కడికక్కడే చనిపోయాడు. ఎర్రి స్వామికి స్వల్ప గాయాలయ్యాయి. ఎర్రి స్వామి అక్కడి నుంచి లేచి శివశంకర్ వద్దకు వెళ్లాడు. అతను చనిపోవడాన్ని గుర్తించి.. బైక్ వద్దకు వెళ్లే ప్రయత్నం చేశాడు. ఆ సమయంలోనే వేగంగా వచ్చిన ట్రావెల్స్ బస్సు బైక్ ను ఢీకొని దూసుకెళ్లింది. దాంతో బస్సుకు ఒక్కసారిగా మంటలు వ్యాపించి కొద్ది నిమిషాల్లో బస్సు దగ్దమైంది.

ఈ ఘటనపై మృతుడు శివశంకర్ కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. శివశంకర్ కారణంగా బస్సు ప్రమాదం జరగలేదని, బస్సు డ్రైవర్ అజాగ్రత్త వల్ల 19మంది ప్రాణాలు కోల్పయారని పేర్కొంటున్నారు. బస్సు డ్రైవర్ అప్రమత్తంగా ఉండిఉంటే ఇంతపెద్ద బస్సు ప్రమాదం జరిగేది కాదని చెబుతున్నారు.

ఇదిలాఉంటే.. ఎర్రిస్వామిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఘటనకు సంబంధించిన వివరాలను సేకరించారు. తాజాగా.. ఎర్రిస్వామి ఉలిందకొండ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అతని ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. ‘బస్సు ప్రమాదం జరగడానికి ముందే బైక్‌ ప్రమాదం జరిగింది. నేను, శివశంకర్ మద్యం సేవించాం. మద్యం మత్తులో నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడంతో బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది.. శివశంకర్ స్పాట్ లో మృతి చెందాడు. నేను గాయపడి ప్రాణాలతో బయటపడ్డా. అయితే డెడ్ బాడీని పక్కకు తీసేందుకు ప్రయత్నించాను.. తమ బైక్ ను మరో వాహనం ఢీకొట్టడంతో అది రోడ్డు మధ్యలో పడింది. దీంతో బస్సు బైకును లాక్కెళ్లింది.. కొద్దిసేపటికే బస్సులో మంటలు చెలరేగి ప్రమాదం జరిగింది’’ అని ఎర్రిస్వామి పేర్కొన్నాడు.

మరోవైపు.. పోలీసుల ఎఫ్ఐఆర్ కాపీలో డ్రైవర్ నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు పేర్కొన్నారు. ఇద్దరి పేర్లను నిందితుల జాబితాలో చేర్చారు. ఏ1గా వి కావేరీ ట్రావెల్స్ బస్సు డ్రైవర్, ఏ2గా వి కావేరీ ట్రావెల్స్ ఓనర్ ను నిందితుడిగా పోలీసులు చేర్చారు.