Vijayawada Floods: భారీవర్షాలకు తోడు ఎగువ నుంచి వచ్చిన వరద కారణంగా బుడమేరు, కృష్ణా నది ఉప్పొంగాయి. దీంతో విజయవాడలోని అనేక కాలనీలు వరద ముంపులో చిక్కుకుపోయాయి. మోకాళ్లలోతు నీళ్లు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రులు, అధికారులు సహాయక చర్యల పర్యవేక్షణలో నిమగ్నమయ్యారు. విజయవాడలో సోమవారం రాత్రి సీఎం చంద్రబాబుతో జరిగిన సమావేశంలో మంత్రులు కీలక నిర్ణయం తీసుకున్నారు. మంత్రుల ఎస్కార్ట్ వాహనాలు విత్ డ్రా చేసుకోవాలని మంత్రి లోకేశ్ ప్రతిపాదించారు. ఆయన ప్రతిపాదనను మంత్రులు అంగీకరించారు. వరద నేపథ్యంలో ఆ వాహనాలను సహాయక చర్యలకు వినియోగించాలని నిర్ణయించారు. దీంతో నిత్యావసర వస్తువులు, భోజనం, తాగునీరు అందించే వాహనాలుగా ఎస్కార్ట్ మంత్రుల వాహనాలు వెళ్లనున్నాయి.
Also Read : బుస కొట్టిన బుడమేరు, ముంచెత్తిన మున్నేరు.. తెలుగు రాష్ట్రాల్లో ఆకస్మిక వరదలకు కారణం ఏంటి?
అర్ధరాత్రి రేపల్లె మండలం వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రులు అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. గండి పడుతుందేమో అనే భయంతో రాత్రంతా కరకట్ట మీదే మంత్రులు కాపలాకాశారు. బలహీనపడిన రావి అనంతవరం కరకట్టను మంత్రులు పరిశీలించారు. పెనుమూడి ఘాట్ వద్ద వరద ఉధృతిపై అధికారులను మంత్రులు వివరాలు అడిగి తెలుసుకున్నారు. జలదిగ్భందం అయిన పెనుమూడి, పల్లెపాలెం నిర్వాసితులతో మాట్లాడి అండగా ఉంటామని వారికి మంత్రులు భరోసా ఇచ్చారు. పునరావాస కేంద్రాల్లో వసతులు ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు.