Kottu Satyanarayana – Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ మరోసారి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ఫైర్ అయ్యారు. కాపు సామాజికవర్గానికి నిజమైన శత్రువు పవన్ కల్యాణ్ అని మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. ఏలూరులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి కొట్టు సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జనసేనాని పవన్ కల్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబుపై నిప్పులు చెరిగారు.
పవన్ కల్యాణ్ నిజంగా ప్రజల కోసం పని చేస్తే బాగుండేదని, కానీ ఆ పరిస్థితి లేదని మంత్రి అన్నారు. సినిమా షూటింగ్ లో 15 రోజులు గ్యాప్ తీసుకుని వచ్చే పవన్ కల్యాణ్, చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్ చదివేసి వెళ్ళిపోతున్నారని విమర్శించారు. పవన్ కల్యాణ్ ధ్యేయం జగన్ మోహన్ రెడ్డిని దించేసి చంద్రబాబుని అధికారం ఎక్కించేయాలని ధ్వజమెత్తారు. చంద్రబాబు ఎంత దుర్మార్గమైన పరిపాలన అందించారో పవన్ కి మాత్రం కనపడదన్నారు.
Also Read..Perni Nani: టీడీపీ నేత నారా లోకేశ్ను కోడిగుడ్లతో కొట్టింది వీరే.. : పేర్ని నాని
”వారాహి యాత్ర అంటూ మళ్ళీ పవన్ కల్యాణ్ యాత్ర చేస్తారట. ఇప్పటికే రెండుసార్లు చంద్రబాబు చెబితే వాయిదా వేశారు. వారాహి స్టీరింగ్ చంద్రబాబు చేతిలోనే ఉంది. పవన్, జనసేన పార్టీకి ఒక సిద్ధాంతం, ఆలోచన లేదు. చంద్రబాబు ఏం చెప్తే అది చేస్తారంతే.
ఈ నాలుగేళ్ళ పరిపాలనలో జగన్ మోహహన్ రెడ్డి ఆయన తండ్రిని మరిపించారు. వైఎస్సార్ సంక్షేమ పరిపాలన మించి పరిపాలన చేస్తున్నారని ప్రజలు చెబుతున్నారు. కాపు సామాజిక వర్గానికి నిజమైన శత్రువు పవన్ కళ్యాణ్. కాపులకు అత్యంత అభిమానుడైన వంగవీటి రంగాను చంద్రబాబు హత్య చేయించారు.
మూటలు అందిస్తున్నారని కాపు జాతిని మొత్తం చంద్రబాబు కాళ్ళ దగ్గర పవన్ కల్యాణ్ పెట్టేస్తున్నారు. పవన్ ఒక స్వార్ధపరుడు. తన స్వార్థం కోసం కాపు జాతిని చంద్రబాబుకి తాకట్టు పెడుతున్నారు. పవన్ కల్యాణ్ డ్రామా ఈ 2024 ఎన్నికల్లో తెలిసిపోతుంది” అని మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు.