PM Narendra Modi : ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఖరారైంది. ఏపీలో నిర్వహించబోయే ఎన్నికల ప్రచారంలో మోదీ పాల్గొననున్నారు. ఈనెల 15న విశాఖలో మోదీ రోడ్ షో నిర్వహించనున్నారు. ఈ నెల 17న చిలకలూరిపేటలో ఆయన పర్యటించనున్నారు. అదే రోజున చిలకలూరిపేటలో టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి బహిరంగ సభ నిర్వహించనున్నారు.
Read Also : Tdp Bjp Janasena Seats Sharing : చంద్రబాబుతో ముగిసిన షెకావత్, జయంత్ పండా భేటీ.. 8గంటల పాటు సుదీర్ఘంగా చర్చలు
ఈ ఉమ్మడి సభలో మోదీ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈ మేరకు ఏపీ బీజేపీ అధిష్టానం అధికారికంగా ప్రకటించింది. ఈ ఉమ్మడి సభలో మూడు పార్టీల నేతలు పాల్గొననున్నారు. 2014 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఒకే వేదికపైకి మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్ కళ్యాణ్ కనిపించనున్నారు. మరోవైపు.. ప్రధాని మోదీ విశాఖ పర్యటన వాయిదా పడింది. మరో తేదీ ఖరారు చేస్తామని బీజేపీ నేతలు ఒక ప్రకటనలో వెల్లడించారు.
కుదిరిన పొత్తు.. మూడు పార్టీలు కలిసి పోటీకి సిద్ధం :
2024 ఎన్నికల నేపథ్యంలో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు కుదిరిన సంగతి తెలిసిందే. రాబోయే ఎన్నికల్లో మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని పార్టీల అధినేతలు వెల్లడించారు. ఇప్పటికే, సీట్ల సర్దుబాటుకు సంబంధించి కేంద్ర హోం మంత్రి అమిత్ షా నివాసంలో చంద్రబాబు, పవన్, అమిత్ షాతో భేటీ అయ్యారు.
ఈ సమావేశంలో సీట్ల సర్దుబాటుతో పాటు ఇతర అంశాలపై చర్చించారు. అందులో ప్రధానంగా సీట్ల కేటాయింపుతో పాటు పొత్తులు, రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చించారు. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, బీజేపీ జాతీయ నేత బైజయంత్ పండాల 8గంటల పాటు సుదీర్ఘంగా చంద్రబాబుతో చర్చలు జరిపారు. సీట్ల సర్దుబాటు, రాజకీయ వ్యూహం, తొలి బహిరంగ సభ నిర్వహణపై ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది.