Roja slams Pawan: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడాలని ఏపీ మంత్రి రోజా హెచ్చరించారు. లేదంటే ఆయనను ప్రజలు ఆదరించబోరని చెప్పారు. పిచ్చిపిచ్చిగా మాట్లాడేవారికి జనాలు ఓట్లు వేయరని అన్నారు. ఏపీలోని ఇప్పటంలో కూల్చివేతలు జరుగుతున్న నేపథ్యంలో ఆ ప్రాంత ప్రజలతో పవన్ కల్యాణ్ మాట్లాడి, ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన అంశంపై రోజా స్పందించారు.
ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ… రోడ్డుపై రౌడీలు రోడ్ షోలు చేయడం ఏంటీ? అని ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ కు దమ్ముంటే జనసేన నుంచి 170 మందిని పోటీకి దింపాలని సవాలు విసిరారు. మన జీవితాలను మార్చేవారికి, అభివృద్ధి పనులు చేసేవారికే జనాలు ఓట్లు వేస్తారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో జగన్ ఎడమ కాలి వెంట్రుకను కూడా ఎవరూ పీకలేరని రోజా వ్యాఖ్యానించారు.
గత ఎన్నికల్లో పవన్ కల్యాణ్ రెండు నియోజక వర్గాల నుంచి పోటీ చేస్తే, ఆ రెండు చోట్లా ఆయనను ప్రజలు ఓడించారని రోజా చెప్పారు. ఇప్పటంలో కూల్చివేతల విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టించేలా వ్యవహరిస్తున్నారని చెప్పారు. బాధ్యత లేకుండా, పద్ధతి లేకుండా వ్యవహరించే వారిని ప్రజలు ఎలా ఆదరిస్తారని ఆమె నిలదీశారు. కాగా, వైసీపీపై విమర్శలు చేసిన పవన్ కల్యాణ్ పై వైసీపీ నేతలు వరుసగా ఎదురుదాడి చేస్తున్నారు.
10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..